భారీ వర్షాలు, వరదల వల్ల గ్రేటర్లో రూ. 450కోట్ల నష్టం వాటిల్లినట్లు హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు సిక్తా పట్నాయక్, ప్రావీణ్య కేంద్ర ప్రభుత్వ అధికారులకు వెల్లడించారు. నగరంలోని ముంపు ప్రాంతాల్లో మంగళవారం కేంద్ర బృందం పర్యటించింది. ఎన్డీఎంఏ జాయింట్ సెక్రటరీ కునాల్ సత్యార్థి నేతృత్వంలో వరద నష్టాన్ని పరిశీలించింది. అనంతరం హనుమకొండ కలెక్టరేట్లో సమావేశం జరుగగా, నష్టంపై కలెక్టర్లు పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రత్యేకంగా ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి కేంద్ర బృందానికి వరదల తీవ్రతపై వివరించారు. 50.61 కిలోమీటర్ల సీసీ, 82.73 కిలోమీటర్ల బీటీ, 84.56 కిలోమీటర్ల మెటల్, 75.23 కిలోమీటర్ల మేర గ్రావెల్ రోడ్లు ధ్వంసమయ్యాయని, 128 కిలోమీటర్ల మేర డ్రైనేజీ వ్యవస్థ దెబ్బతిన్నదని, 71 కల్వర్టులు వరదలో కొట్టుకుపోయాని, 41.3 కిలోమీటర్ల మేర మంచినీటి సరఫరా పైప్లైన్ తుడిచి పెట్టుకుపోయిందని వెల్లడించారు.
– హనుమకొండ/వరంగల్, ఆగస్టు 1
వరంగల్/హనుమకొండ, ఆగస్టు 1 : వరదలతో జరిగిన అపార నష్టాన్ని కేంద్ర ప్రభుత్వం బృందం పరిశీలించింది. రోడ్లు, మంచినీటి వ్యవస్థ, డ్రైనేజీ, ఇండ్లు దెబ్బతిన్న ప్రాంతాల్లో బృందం సభ్యులు పర్యటించారు. అధిక వానలతో వచ్చిన వరదతో భారీ నష్టం జరిగిందని అధికారులు కేంద్ర బృందానికి వివరించారు. ఏడుగురు సభ్యుల కేంద్ర బృందం మంగళవారం వరంగల్, హనుమకొండ జిల్లాల్లో పర్యటించి, వరద నష్టంపై అంచనా వేశారు. ఎన్డీఎంఏ జాయింట్ సెక్రటరీ కునాల్ సత్యార్థి నేతృత్వంలోని ఈ బృందంలో డిప్యూటీ సెక్రటరీ అనిల్ గైరోల, రీజినల్ ఆఫీసర్ కుష్వా, జలశక్తి డైరెక్టర్ రమేశ్కుమార్, అగ్రికల్చర్ జాయింట్ డైరెక్టర్ పూను స్వామి, హైదరాబాద్ ఎన్ఆర్ఎస్సీ డైరెక్టర్ శ్రీనివాసులు, పవర్ భవ్య పాండే సభ్యులుగా ఉన్నారు. నష్టం వివరాలను హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు, గ్రేటర్ కమిషనర్ వివరించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలు, దెబ్బతిన్న ఇండ్లు, రోడ్లను ఇతర నష్టాలను పరిశీలించారు. రెండు జిల్లాలతోపాటు వరంగల్ గ్రేటర్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో వర్షాలకు వాటిల్లిన నష్టంపై హనుమకొండ కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వరద ప్రభావిత ప్రాంతాల ఫొటో ఎగ్జిబిషన్ను కేంద్ర బృందం సభ్యులు తిలకించారు.
అనంత రం వరదల కారణంగా దెబ్బతిన్న, నష్టపోయిన వివరాలను కేంద్ర బృందానికి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్, వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య, గ్రేటర్ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషాలు వివరించారు. జూలై 17 నుంచి ఇప్పటి వరకు 59 సెంటీ మీటర్ల వర్షం కురిసిందని, వరదలతో 14 మండలాలు ప్రభావితమయ్యాయని కేంద్ర బృందానికి కలెక్టర్ సిక్తా పట్నాయక్ వివరించారు. భారీ వర్షాల వల్ల హనుమకొండ జిల్లాలో రూ.450 కోట్ల నష్టం వాటిల్లినట్లు తెలిపారు. వరదలతో జిల్లాలో ఆరుగురు, 26 జంతువులు చనిపోయాయని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 41 చెరువులు దెబ్బతిన్నాయని వివరించారు. 8.30 కిలోమీటర్ల మేరకు 22 ఆర్అండ్బీ రోడ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయన్నారు. 3,065 మీటర్ల మేర రోడ్డు కోతకు గురైందని, ఈ నష్టం అంచనా రూ.40 కోట్లు ఉంటుందన్నారు. 61 పంచాయతీరాజ్ రోడ్లు 138.78 కిలోమీటర్లు దెబ్బతిన్నాయని, నష్టం అంచనా రూ.59 కోట్లు ఉంటుందని చెప్పారు. జిల్లాలో 231 ఇండ్లు పాక్షికం గా.. 25 ఆవాసాల్లో మిషన్ భగీరథ పైపులైన్ దెబ్బతిన్నదని తెలిపారు.
ఆర్అండ్బీకి చెందిన 32 పైపు కల్వర్టులు, పంచాయతీరాజ్ శాఖకు చెందిన 15 బ్రిడ్జిలు పాక్షికంగా నష్టపోయాయని, వీటి నష్టం రూ.3.30 కోట్లు ఉంటుందన్నారు. 1084 ఎకరాల్లో నష్టం జరిగిందని, ఇది రూ.1.80 కోట్లు ఉంటుందని చెప్పారు. గ్రేటర్ బయటి ప్రాంతాల్లో నాలుగు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి, 270 మందికి ఆశ్రయం కల్పించినట్లు తెలిపారు. గ్రేటర్లో జూలై 18 నుంచి 27 వరకు 60 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైందని కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా కేంద్ర బృందానికి వివరించారు. వరంగల్ మహానగరంలో వరదల వల్ల 150.61 కిలోమీటర్ల సీసీ రోడ్లు దెబ్బతిన్నదని ఈ నష్టం అంచనా రూ.110.71కోట్లు ఉంటుందని తెలిపారు. 82.73 కిలోమీటర్ల బీటీ రోడ్డు దెబ్బతిన్నదని, దీని నష్టం రూ.92.94 కోట్లు అని పేర్కొన్నారు. 84.56 కిలోమీటర్ల మెటల్ రోడ్డు దెబ్బతిన్నదని, దీని అంచనా రూ 43.55 కోట్లు అని… 75.23 కిలోమీటర్ల గ్రావెల్ రోడ్డు నష్టం రూ.9.37 కోట్లు అని వివరించారు. 128 కిలోమీటర్ల డ్రైనేజీ వ్యవస్థ దెబ్బతినగా రూ.63.9 కోట్లు, 71 కల్వర్టులు వరదలో కొట్టుకుపోగా వీటికి 52.41 కోట్లు అవసరమవుతాయని వివరించారు.
41.3 కిలోమీటర్ల మంచినీటి సరఫరా పైపు లైన్ ధ్వంసమైందని, రూ.25 కోట్లతో మరమ్మతు చేయాల్సి ఉందని చెప్పారు. వరద బాధితులకు సహాయ చర్యల కోసం గ్రేటర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, దీనికి 535 ఫిర్యాదులు రాగా, ఐదు సహాయక బృందాలను రక్షిత ప్రాంతాలకు పంపించినట్లు తెలిపారు. గ్రేటర్లో 199 కాలనీలు పాక్షికంగా మునగగా, సత్వరంగా వరద నీటిని తొలగించామని తెలిపారు. వరదలు, గాలులకు పడిపోయిన 32 చెట్లను తొలగించినట్లు చెప్పా రు. గ్రేటర్ ఆధ్వర్యంలో 27 ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి దాదాపు 3500 బాధితులను తరలించామన్నారు. అనంతరం కలెక్టర్లు కమిషనర్, అధికారులతో కలిసి కేంద్ర బృందం సభ్యులు గ్రేటర్ పరిధిలోని జవహర్కాలనీ, పోతననగర్ ప్రాంతాల్లో పర్యటించారు. భద్రకాళి చెరువుకు గండి పడిన ప్రాంతాన్ని, బొం ది వాగును పరిశీలించారు. అనంతరం కేంద్ర బృందం వరంగల్, హనుమకొండ జిల్లాల్లో పర్యటించింది. అధిక వర్షాలతో జరిగిన నష్టాలు, సహాయక చర్యలను అంచనా వేసేందుకు, కేంద్రం నుంచి అదనపు సాయం ఇచ్చేందుకు ఈ బృందం సిఫారసు చేయనుంది.