వరంగల్ చౌరస్తా, జూలై 12 : ఎంజీఎం ఆస్పత్రి వైద్యాధికారుల తీరు మారలేదు. ఎప్పటిలాగే నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా మెడికో లీగల్ కేసు (ఎమ్మెల్సీ) ల విషయమై గతంలో ఉన్నతాధికారులు విచారణ జరిపి ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. కోర్టు వ్యవహారాలతో ముడిపడి ఉండే ఎమ్మెల్సీ కేసులకు సంబంధించి వైద్యాధికారులు వ్యవహరిస్తున్న తీరుతో అటు రోగులు, ఇటు పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.
ప్రమాదాలు, దాడులు, అనుమానాస్పద ఘటనల్లో క్షతగాత్రులకు చికిత్స అందించే సమయంలో ఇటు పోలీసులు, అటు గాయాల తీవ్రతను కోర్టుకు అందించేందుకు తప్పనిసరిగా కేస్షీట్తో పాటు పరీక్షలు నిర్వహించేందుకు జారీచేసే రిక్విసిషన్పైనా వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. బాధితుడికి అయిన గాయాలతో పాటు శరీరంపై ఉన్న పుట్టమచ్చలు, గుర్తింపు చిహ్నాలను కూడా కేస్షీట్లో పొందుపర్చాలి.
అయితే కనీసం తేదీ, పేరు లేకుండానే వైద్యాధికారులు క్షతగాత్రుడికి ఏయే భాగాల్లో ఎక్స్రే తీయాలనే విషయాన్ని నమోదు చేసిన రిక్విసిషన్ను రేడియాలజీ విభాగానికి పంపించారు. క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ల నిర్లక్ష్యంపై ఎంజీఎంహెచ్ వైద్యాధికారులే ముక్కున వేలేసుకుంటున్నారు. గతంలో జరిగిన ఇలాంటి ఘటనలపై కలెక్టర్ ఆదేశాలతో విచారణ జరిపిన ఉన్నతాధికారులు ఎమ్మెల్సీ కేసుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలిచ్చినప్పటికీ వారి తీరులో మాత్రం మార్పు రావడంలేదు. ఇకనైనా అధికారులు స్పందించి ఎమ్మెల్సీ కేసుల విషయంలో జాగ్రత్తలు పాటించేలా చర్యలు తీసుకోవాలని రోగులు, అటెండెంట్లతో పాటు పోలీసులు కోరుతున్నారు.