తాడ్వాయి, డిసెంబర్19 : మేడారం మహా జాతరలో భాగంగా చేపట్టే అభివృద్ధి పనులను సంక్రాంతి పండుగ లోపు పూర్తి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. మేడారంలోని ఐటీడీఏ క్యాంపు కార్యాలయంలో మంగళవారం అడిషనల్ కలెక్టర్ వేణుగోపాల్, ఐటీడీఏ పీవో అంకిత్, అదనపు కలెక్టర్ శ్రీజతో కలిసి కలెక్టర్ సమావేశం నిర్వహించారు. మహా జాతర సమయం ముంచుకొస్తున్నదని, అభివృద్ధి పనులు యుద్ద ప్రాతిపదికన చేపట్టి పూర్తి చేయాలన్నారు. అధికారులు మేడారంలో క్షేత్రస్థాయిలో ఉండి పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు నివేదికలు ఇవ్వాలన్నారు. ఏఈఈలు, డీఈలు మేడారంలో ఉంటూ పనులను ప్రారంభించాలని, ఈఈలు ప్రతిరోజూ క్షేత్రస్థాయిలో సందర్శించి పనుల పురోగతి ఫొటోలు గ్రూప్లో పోస్ట్ చేయాలన్నారు. ప్లాస్టిక్ ఫ్రీ జాతరగా నిర్వహించేందుకు ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని కలెక్టర్ చెప్పారు. వ్యాపారులకు ప్లాస్టిక్ కవర్లపై అవగాహన కల్పించడంతో పాటు ప్రత్యామ్నాయ వస్తువులు ఎక్కడ దొరుకుతాయి, ఎంతలో దొరుకుతాయి అనే వివరాలు తెలిసేలా ప్రదర్శించాలని తెలిపారు. అనంతరం ఊరట్టం, చిలుకలగుట్ట ప్రాంతంలో పార్కింగ్ ఏర్పాటుకు కలెక్టర్ స్థలాన్ని పరిశీలించారు. సమావేశంలో మేడారం జాతర కార్యనిర్వహణ అధికారి రాజేంద్రం, ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ హేమలత, డీపీవో వెంకయ్య, డీఎంహెచ్వో అప్పయ్య, వివిధ శాఖల ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు. అలాగే మేడారంలోని గిరిజన మ్యూజియాన్ని ఐటీడీఏ పీవో అంకిత్ సందర్శించారు. తల్లులను దర్శించుకునేందుకు కోటి మంది భక్తులు రానున్నందున వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. సందర్శకులకు ఆహ్లాదం కలిగేలా మ్యూజియం ఆవరణలో గార్డెన్ ఏర్పాటు చేయాలని, రంగులు వేయాలని, మైనర్ రిపేర్ చేపట్టాలని గిరిజన సంక్షేమశాఖ ఈఈ హేమలతను ఆదేశించారు. మ్యూజియంలోని పరికరాలు, పనిముట్ల వివరాలు తెలిసేలా కీవోస్ ఏర్పాటు చేయాలన్నారు.
జాతరలో విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఎన్పీడీసీఎల్ డీఈ పులుసం నాగేశ్వర్రావు తెలిపారు. ఇప్పటికే నిరంతర విద్యుత్ సేవల కోసం డిసెంబర్ మొదటివారంలోనే పనులను ప్రారంభించామని, 50శాతం పనులు పూర్తయ్యాయన్నారు. 315కేవీఏ కెపాసిటీ గల డీటీఆర్లను ఏర్పాటు చేసే పనులు పూర్తయ్యాయని, వరి కోతలు పూర్తి కాగానే మిగతా పనులు ప్రారంభించి జనవరి నాటికి పూర్తి చేస్తామని తెలిపారు. ఇప్పటికే ఆర్టీసీ బస్టాండ్, చిలుకలగుట్ట, జంపన్నవాగు, గద్దెల పరిసరాల్లో డీటీఆర్లను ఏర్పాటు చేశామన్నారు. జాతరలో విద్యుత్ సమస్యలు తలెత్తకుండా మొత్తం 200 డీటీఆర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. జాతర అభివృద్ధి నిధులు విడుదల కాకపోయినా తమ సంస్థ నిధులు ఖర్చు చేస్తూ పనులు చేపడుతున్నట్లు చెప్పారు. వివిధ శాఖల అధికారులు పార్కింగ్, ఆర్డబ్ల్యూఎస్ శాఖ అధికారులు కోరిన చోట్ల విద్యుత్ సరఫరాకు ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు.