వరంగల్, ఫిబ్రవరి 29 : మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర హుండీల లెక్కింపు మొదలైంది. గురువారం హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో జాతరలో ఏర్పాటు చేసిన 518 హుండీల్లో తొలి రోజు 134 హుండీల్లోని ఆదాయం లెక్కించారు. రూ. 3 కోట్ల 15 లక్షల 40 వేల ఆదాయం వచ్చినట్లు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. ఆదాయాన్ని దేవాదాయ శాఖ అధికారులు హెచ్డీఎఫ్సీ, యూనియన్, కెనరా బ్యాంకుల్లో జమ చేశారు. దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీకాంతరావు, ములుగు ఆర్డీవో సత్యపాల్రెడ్డి, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ రామల సునీత, మేడారం జాతర ఈవో రాజేంద్రం, జాతర పూజారుల పర్యవేక్షణలో హుండీల లెక్కింపు ప్రక్రియ సాగింది. దేవాదాయ శాఖ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలకు చెందిన సుమారు 350 మంది లెక్కింపులో పాల్గొన్నారు. హుండీల లెక్కింపు ప్రక్రియ మరో నాలుగు రోజులు జరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
మేడారం జాతర హుండీల్లో ఆరు నోట్లు కలకలం సృష్టించాయి. అంబేద్కర్ ఫొటోతో ముద్రించిన ఆరు రూ.100 నోట్లను సిబ్బంది గుర్తించారు. గాంధీ ఫొటో ఉండాల్సిన స్థానంలో అంబేద్కర్ ఫొటో ముద్రించిన వంద రూపాయల నోట్లను భక్తులు హుండీల్లో వేశారు. ఈ నోట్లపై అంబేద్కర్ ఫొటోతో వంద రూపాయల నోట్లను ముద్రించాలని రిజర్వ్ బ్యాంక్ను డిమాండ్ చేస్తూ నోట్ రాయడం చర్చనీయాంశంగా మారింది.