గంగారం, ఫిబ్రవరి 29 : మేడారం మహాజాతర పరిసమాప్తమైంది. సమక్క- సారలమ్మ తల్లులు గద్దెల నుంచి తిరిగి వనం చేరుకున్నారు. జాతర సందర్భంగా మేడారంలోని గద్దెలపై భక్తుల మొక్కులందుకున్న సమ్మక్క భర్త పగిడిద్దరాజు తిరిగి తన స్వస్థలమైన మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్లకు చేరుకోగా, తిరుగువారం పండుగను పెనక వంశీయులు ఘనంగా నిర్వహించారు. గురువారం రెండో తిరు గువారం (నాగవెల్లి)జాతరను కన్నుల పండువగా జరిపారు. ఆలయ పూజారులు, గ్రామస్తులు ఉదయం గ్రామ సమీపంలోని దేవుడి గుట్టకు చేరుకుని రహస్య పూజలు చేశారు. అక్కడి నుంచి కంకవనాన్ని తీసుకొని డప్పచప్పుళ్లు, శివసత్తుల పూనకాలతో గ్రామ పొలిమేరకు చేరుకోగానే గ్రామస్తులు, భక్తులు నీళ్లారబోసి స్వాగతం పలికారు. సంతానం కోసం కొందరు మహిళలు వరం పట్టగా, వారిపై నుంచి వనాన్ని తీసుకెళ్లి పడిగిద్దరాజు ఆలయంలో గద్దెలపై ప్రతిష్ఠించారు. తిరిగి సాయంత్రం పగిడిద్దరాజు పడిగ రూపాన్ని గ్రామంలోని ప్రతి ఇంటికీ ఊరేగింపుగా తీసుకెళ్లారు. అనంతరం గంగా స్నానం చేసి రాత్రి గుడికి చేరుకున్నారు. గిరిజన సంప్రదాయ ప్రకారం అర్ధరాత్రి గుడిమెలిగే పండుగ చేశారు. తెల్లవారుజామున హరణి పెట్టడంతో (దేవుడికి ఇష్టమైన నైవేద్యం) రెండో రోజు జాతర ముగుస్తుంది. శుక్రవారం భక్తుల మొక్కులతో జాతర పూర్తవుతుందని పూజారులు పెనక సురేందర్, రాజేశ్వర్, పురుషోత్తం తెలిపారు.