మేడారం మహాజాతర 2024 సమయం తరుముకొస్తోంది. మరో 68 రోజుల్లో ఉత్సవం ప్రారంభం కానుంది. హైదరాబాద్, హనుమకొండ వైపు నుంచి లక్షలాది మంది భక్తులు జాతీయ రహదారి-163 మీదుగా మేడారం జాతరకు వస్తుంటారు. అయితే దామెర నుంచి గట్టమ్మ ఆలయం వరకు విస్తరిస్తున్న రోడ్డు పను లు ఈసారి ఉత్సవానికి అడ్డంకిగా మారనున్నాయి. ఏడాది కాలంగా ఎన్హెచ్ విస్తరణ పనులు నత్తకు నడక నేర్పేలా కొనసా..గుతున్నాయి. ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టింపు లేకుండా వ్యవహరిస్తుండడంతో ఈ సారి జరిగే జాతరలో భక్తులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం మల్లంపల్లి వరకు పనులు పూర్తికాగా, మధ్యమధ్యలో కల్వర్టుల నిర్మాణాల వద్ద రోడ్డు పనులు చేయకుండా వదిలేస్తున్నారు. దీంతో ప్రయాణికులకు ఈ రహదారి నరకప్రాయంగా మారింది.
కోటి మంది భక్తుల కొంగుబంగారమైన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరను ప్రతి రెండేళ్లకొక సారి జరపడం ఆనవాయితీ. ఈ జాతరకు దేశ నలుమూలల నుంచి లక్షలాది భక్తులు తరలివస్తారు. హైదరాబాద్, హనుమకొండ వైపు నుంచి వివిధ జిల్లాలు, ప్రాంతాలు, రాష్ర్టాల నుంచి భక్తులు జాతీయ రహదారి-163 మీదుగా వస్తుంటారు. 2024 జాతరకు ఏడాది కాలంగా జరుగుతున్న ఎన్హెచ్ విస్తరణ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. ఎప్పటికప్పుడు పర్యవేక్షించి పనుల పురో గతిని పరిశీలించాల్సిన అధికారులు అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. మేడారం జాతరకు మరో 68 రోజుల గడువు మాత్రమే ఉండగా పనులు గట్టమ్మ ఆలయం వరకు పూర్తి కావాల్సి ఉండగా మల్లంపల్లి వరకే పూర్తయ్యాయి. గడువులోగా పూర్తవుతాయో లేదోననే సందేహం కలుగుతోంది.
జాతీయ రహదారి మీదుగా మేడారానికి వివిధ వాహనాల్లో భారీ ఎత్తున తరలివచ్చే భక్తులకు ఎన్హెచ్ విస్తరణ పనులు అడ్డంకిగా మారనున్నాయి. జాతరలోగా గట్టమ్మ దేవాలయం వరకు పూర్తి కానట్లయితే వాహనాలు రోడ్డు ప్రమాదానికి గురికావడంతో పాటు ట్రాఫిక్ సమస్య తీవ్రంగా తలెత్తే అవకాశం ఉండనున్నది. ఏటా జాతరకు నెల రోజుల ముందు నుంచే భక్తుల తాకిడి మేడారానికి పెరుగుతుంది. అది కూడా హనుమకొండ నుంచి ములుగు మీదుగా ఎక్కువ సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఎన్హెచ్ విస్తరణ పనులు ఆలస్యం కావడంతో మేడారం భక్తుల తాకిడికి పనులు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా, ములుగు జిల్లాలో పనిచేస్తున్న ఉన్నతాధికారులందరూ నిత్యం హనుమకొండ నుంచి రాకపోకలను కొనసాగించే వారే. జాతరను దృష్టిలో ఉంచుకొని పనుల వేగవంతానికి తగిన చర్యలు తీసుకోవడంలో సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం, వారి అలసత్వ ధోరణికి భక్తులకు తిప్పలు తప్పేలా లేవు. ఏదేమైనా జాతరకు నెల రోజులకు ముందు ప్రస్తుతం జరుగుతున్న ఎన్హెచ్ విస్తరణ పనులు గట్టమ్మ దేవాలయం వరకు చేరేలా లేవు. జాతరకు వచ్చే భక్తులకు రవాణాపరమైన ఇబ్బందులను అధికారులు ఏ మేరకు తలెత్తకుండా చర్యలు చేపడుతారో వేచి చూడాల్సిన అవసరం ఉంది.
రూ. 350 కోట్లతో జాతీయ రహదారుల విభాగం ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లా దామెర నుంచి గూడెప్పాడ్ వరకు, నీరుకుళ్ల క్రాస్ నుంచి ములుగు జిల్లా కేంద్రంలోని గట్టమ్మ దేవాలయం వరకు ఎన్హెచ్ 163 విస్తరణ పనులను గతేడాది ప్రారంభించారు. వీటిని దక్కించుకున్న సంబంధిత కాంట్రాక్టర్ తొలుత వేగవంతంగా పనులు చేసినప్పటికీ ప్రస్తుతం అధికారుల పర్యవేక్షణ లేక నెమ్మదిగా కొనసాగుతున్నాయి. ఫోర్లేన్ రోడ్డు నిర్మాణంతోపాటు మధ్యలో డివైడర్ను నిర్మిస్తున్నారు. ఈ విస్తరణ పనులను చేపట్టిన కాంట్రాక్టర్ అక్కడక్కడ కల్వర్టు పనులను పూర్తి చేయలేదు. రోడ్డు నిర్మాణాన్ని కూడా మధ్య మధ్యలో పూర్తి చేశారు. ఒక లేయర్ బీటీ మాత్రమే వేశారు. మరో రెండు లేయర్ల బీటీ రోడ్డు వేయాల్సి ఉంది. ములుగు జిల్లా పరిధిలో మహ్మద్గౌస్పల్లి నుంచి జాకారం వరకు కల్వర్టు నిర్మాణ పనులు ప్రారంభ దశలోనే ఉండడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఉన్న ఎన్హెచ్ రోడ్డుకు ఇరువైపులా మట్టిని, మెటల్ రోడ్డును పోయగా ప్రస్తుతం భారీ వాహనాల రాకపోకలతో దుమ్ము లేస్తున్నది. దీంతో ఇతర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అక్కడక్కడా మెటల్ రోడ్డు సరిగా లేక గుంతలను తలపించేలా ఉండడంతో రాత్రి వేళల్లో వాహనాలపై ప్రయాణం కొనసాగించే వాహనదారులు రోడ్డు ప్రమాదాలకు గురయ్యేలా అవకాశం ఉంది.