ములుగు రూరల్, ఫిబ్రవరి 22: జంపన్నవాగులో పిల్లలు సరదాగా జలకాలాడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. చింతల్ క్రాస్ వద్ద విడిది ఏర్పాటు చేసుకున్న భక్తులు సమీపంలోని జంపన్నవాగులో స్నానాలు చేస్తున్నారు. గురువారం ఇక్కడి చెక్డ్యామ్ వద్ద నీటిలో కేరింతలు కొట్టిన నలుగురు చిన్నారులు చలికి వణుకుతూ కొద్దిసేపు ఇలా కూర్చున్నారు. ‘నమస్తే తెలంగాణ’ ఫొటో క్లిక్మనిపిస్తుండగా టాటా చెబుతూ పోజిచ్చారు.
వాజేడు, ఫిబ్రవరి 22: మేడారం జాతరలో మటన్ అగ్గువకే వస్తోంది. మేకలు, గొర్రెలు కొనుగోలు చేయలేని భక్తులు మటన్ దుకాణాలకు వెళ్తున్నారు. ఇక్కడ కిలో రూ.800కే అమ్ముతుండగా కొనుగోలుదారులతో మటన్షాపుల వద్ద రద్దీ ఉంటోంది.
తాడ్వాయి, ఫిబ్రవరి 22 : మేడారం మహాజాతరలో మందుబాబులు మద్యం కోసం బారులుదీరుతున్నారు. సమ్మక్క-సారలమ్మలను దర్శించుకునేందుకు భక్తులు గురువారం పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ప్రభుత్వం జాతర పరిసరాల్లో 22 వైన్స్ షాపులను కేటాయించగా, ఆయా షాపుల్లో మద్యం ధరలు ఎక్కువగా ఉన్నాయి. గ్రామంలో గతంలో సాధారణంగా కేటాయించిన వైన్స్ షాపులో ఎమ్మార్పీకే అమ్ముతున్నారు. దీంతో మందుబాబులు క్యూ కడుతున్నారు. మద్యం కొనుగోలుకు ఎగబడుతున్నారు.
మంగపేట, ఫిబ్రవరి 22 : ఆసియా ఖండంలోనే పేరుగాంచిన మేడారం జాతరలో గద్దెలపైకి సమ్మక్క-సారలమ్మలు వేంచేసిన వేళ వనదేవతలను నేరుగా దర్శించుకోవాలనే అందరూ ఆరాటపడుతారు. అయితే మేడారం వచ్చే వీలులేని యూకేలో ఉన్న ఓ కుటుంబం వినూత్న పద్ధతిలో ల్యాప్టాప్ ద్వారా మొక్కులు చెల్లించుకుంది. సంప్రదాయబద్దంగా సమ్మక్క-సారలమ్మను పెట్టుకొని రెండు కొబ్బరికాయలు, బెల్లం, కోళ్లను సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు. జీవనోపాధి రీత్యా విదేశాల్లో ఉండి సంస్కృతీ సంప్రదాయాలను మరచి పోకుండా ఖండాంతరాల నుంచి భక్తిని చాటడం గురువారం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ములుగు రూరల్ : జాతరలో భక్తులకు వైద్యారోగ్య శాఖ మాస్కులు పంపిణీ చేస్తోంది. టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ ఆర్వీ కర్ణన్ ప్రభుత్వం ద్వారా 15లక్షల మాస్కులు సరఫరా చేశారు. సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి తెప్పించి భక్తులకు ఇస్తున్నట్లు డీఎంహెచ్ఓ అల్లెం అప్పయ్య తెలిపారు. వాటిని భక్తుల ఆరోగ్య సంరక్షణ కోసం సిబ్బంది ఇలా అందిస్తున్నారు.
ఏటూరునాగారం, ఫిబ్రవరి 22 : మేడారంలో సమ్మక్క తల్లి రాకముందు నుంచే పూజారులు, వడ్డెలు గద్దె వద్ద అనేక పూజలు చేస్తారు. చిలకల గుట్ట నుంచి తల్లిని పోతరాజు ముందుండి నడిపిస్తాడని నమ్మకంతో అతడి ప్రతిరూపాన్ని గద్దెపై ప్రతిష్ఠిస్తారు. పోతరాజును అనుముగా భావించి సమ్మక్క పూజారులు, గ్రామ పెద్దలు, అభ్యుదయ యువజన సంఘం, ఆదివాసీ సంఘాలు గురువారం ఉదయం అనుముగుట్టకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి కంకవనంతో బయలుదేరి గ్రామ పొలిమేరల్లోకి రాగానే మహిళలు నీళ్లారబోసి స్వాగతం పలికారు. అక్కడే ఉన్న పోతరాజు పూజామందిరానికి చేరుకున్నారు.
అంతకుముందే మందిర ప్రాంగణాన్ని మహిళలు నీటితో శుద్ధి చేసి పసుపు, కుంకుమతో అలంకరించారు. వనం నుంచి తీసుకొచ్చిన కంకవనంతో పోతరాజు మందిరంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం డప్పువాయిద్యాల నడుమ ఊరేగింపుగా వెళ్లి మేడారంలోని సమ్మక్క గద్దెపై ప్రతిష్ఠించారు. గద్దెలపై కంకవనం ప్రతిష్ఠించిన అనంతరం పూజారులు, వడ్డెలు, ఆదివాసీ పెద్దలు చిలకలగుట్టకు బయలు దేరివెళ్లారు. ఈ కార్యక్రమంలో పూజారులు, గ్రామ పెద్దలు సిద్దబోయిన జగ్గారావు, మునీందర్, సురేందర్, కొక్కెర కృష్ణయ్య, మల్లెల ముత్తయ్య, లక్ష్మయ్య, పీరీల వెంకన్న, మల్లెల ముత్తయ్య, సిద్దబోయిన స్వామి, సిద్దబోయిన వెంకన్న, నర్సింగారావు, చేల రామయ్య, పొడెం కృష్ణప్రసాద్ పాల్గొన్నారు.
వాజేడు, ఫిబ్రవరి 22 : మేడారం జాతరలో కొత్తమీర మస్తు పిరమైంది. మటన్, చికెన్, కూరగాయలు.. ఏ కూరైనా కొత్తిమీర తప్పకుండా వేసుకోవాల్సిందే. అందుకే గిరాకీ బాగా పెరిగి.. చిన్న కట్టకే రూ.50 పలుకుతోంది. అయినప్పటికీ జనం కొనుగోలు చేస్తున్నారు.
ములుగు రూరల్ : రద్దీగా ఉండే మేడారం రహదారుల్లో తప్పిపోకుండా ఉండేందుకు భక్తులు గుర్తులను ఏర్పాటు చేసుకుంటారు. కర్రకు రకరకాల జెండాను అమర్చి పైకెత్తి పట్టుకుని ఒకరినొకరు అనుసరిస్తారు. ఇలా గురువారం ఓ వ్యక్తి కర్రకు టవల్ కట్టుకొని తమ వాళ్లను తీసుకెళ్తుండగా ‘నమస్తే’కు చిక్కాడు
మేడారం మహాజాతరకు లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు కొబ్బరి కాయలు కొట్టి, తనివితీరా మొక్కులు చెల్లించుకొని తన్మయత్వం పొందుతున్నారు. గద్దెల వద్ద పోగైన కొబ్బరిని ప్రాంగణంలో ఆరబెడుతున్నారు.