సారలమ్మ, గోవిందరాజులు, పగిడిద్దరాజు ప్రతిమలను గద్దెలపైకి వచ్చిన సందర్భంలో మేడారం, కన్నెపల్లి, రెడ్డిగూడెం, జంపన్నవాగు, నార్లాపూర్ పరిసర ప్రాంతాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. భక్తుల పుణ్యస్నానాలతో జంపన్నవాగు మొత్తం జనంతో నిండిపోయింది. సారలమ్మ గద్దెపైకి రాగానే భక్తులు పరవశంతో దర్శనం కోసం ఒకసారిగా గద్దెల వద్దకు వచ్చేందుకు ప్రయత్నించారు. మూడు కిలోమీటర్ల మేర ఏర్పాటు చేసిన క్యూలైన్లు సరిపోక రోడ్డుపై సైతం వరుసల్లో బారులు తీరారు.
అంతకుముందు తల్లుల గద్దెలకు పూజారులు అలుకుపూతలు చేశారు. కాక వంశీయులు సారలమ్మ గుడి నుంచి, మేడారంలోని సమ్మక్క పూజా మందిరం నుంచి పూజారులు వారి కుటుంబ ఆడబిడ్డలు పసుపు, కుంకుమలు, పూజా సామగ్రినితో డోలివాయిద్యాల నడుమ గద్దెల వద్దకు చేరుకొని అలుకుపూతల కార్యక్రమం నిర్వహించారు.