తాడ్వాయి, ఫిబ్రవరి 9 : చల్లని తల్లులు సమ్మక్క-సారలమ్మ దీవెనల కోసం భక్తులు మేడారానికి పోటెత్తుతున్నారు. బుధవారం మండమెలిగే పండుగ నిర్వహించడంతో వివిధ ప్రాంతాల నుంచి 15 లక్షల మంది తరలివచ్చారు. జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి, తలనీలాలు ఇచ్చారు. తల్లుల గద్దెల వద్దకు చేరుకుని బంగారం (బెల్లం) సమర్పించారు. జంపన్న వాగు మొదలుకుని, ఆర్టీసీ బస్టాండ్, చిలకలగుట్ట ప్రాంతాలు భక్తుల విడిదితో మహా జాతరను తలపించాయి. భక్తులతో గద్దెల పరిసరాలు కిక్కిరిసిపోయాయి. క్యూలైన్లు కిటకిటలాడాయి.