ములుగు, జనవరి12(నమస్తేతెలంగాణ) : మేడారం జాతర పరిధిలో విలేజ్ డెవలప్మెంట్ కమిటీల అనుమతి లేకుండానే అభివృద్ధి పనులు చేపట్టడం స్థానిక గ్రామ పాలకులు, వీడీసీ సభ్యుల్లో ఆగ్రహానికి కారణమవుతున్నది. జాతర అభివృద్ధిలో నామినేటెడ్ పనులకు వీడీసీల అనుమతి తప్పనిసరి. గతంలో సర్పంచ్, పాలకవర్గ సభ్యు లు, వీడీసీల అనుమతి తీసుకున్నాకే పను లు చేపట్టేవారు. అగ్రిమెంట్ అనంతరమే పనులను ప్రారంభించాల్సి ఉంటుంది. కానీ గిరిజన సంక్షేమ శాఖ అధికారులు ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ తూతూమంత్రంగా పనులు కానిచ్చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. గ్రామాభివృద్ధికి రావాల్సిన నిధులను కాంట్రాక్టర్లకే కట్టబెట్టేలా అధికారులు వ్యవహరిస్తున్నారని, పంచాయతీల అనుమతి, వీడీసీల ప్రమేయం లేకుండానే పనులు చేసేందుకు సిద్ధమయ్యారని, వీడీసీ అనుమతి లేనిదే బిల్లులు ఇవ్వొద్దు అన్న నిబంధన ఉన్నా అధికారులు, కాంట్రాక్టర్లు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మేడారం జాతర అభివృద్ధి పనుల్లో భాగంగా ఐటీడీఏ ఇంజినీరింగ్ అధికారులు మేడారం పంచాయతీ పరిధిలో రోడ్లు, రోడ్ల మరమ్మతులకు రూ.80లక్షలు, ఊరట్టం పంచాయతీ పరిధిలో రూ. 31లక్షల విలువగల నామినేటెడ్ పనులను కేటాయించారు. పనుల్లో రూ.లక్షకు 5శాతం కమీషన్ చెల్లించాల్సి ఉంటుంది. కమీషన్ రూపంలో పంచాయతీలకు పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరి గ్రామాల్లో అభివృద్ధి పనులకు వీలు కలుగుతుంది. కానీ అధికారులు, కాంట్రాక్టర్ల తీరుతో గ్రామాలకు రావాల్సిన నిధులకు గండిపడేలా ఉంది. అధికారులు కూడా వీడీసీలకు సంబంధం లేకుండానే పనులను ప్రారంభిస్తూ కాంట్రాక్టర్లకు సహకరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఆయా జీపీల సర్పంచ్లు వీడీసీల అనుమతి తీసుకోరా అని కాంట్రాక్టర్లను అడిగినా తీసుకుంటామని అప్పటి మందం సమాధానం చెబుతూ పనులు చేస్తున్నట్లు తెలుస్తున్నది. 10 రోజుల క్రితం ప్రారంభించిన పనులను కూడా ఆ రోజున అగ్రిమెంట్ చేసుకున్నట్లుగా బాండ్ పేపర్ను అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. కానీ ఇప్పటి వరకు బాండ్ పేపర్పై వీడీసీలు ఎలాంటి సంతకాలు చేయలేదు. పనులను ప్రారంభిస్తున్నట్లు సంబంధిత పంచాయతీలకు సమాచారం కూడా లేదు. నకిలీ బాండ్ పేపర్లను సృష్టించి కాంట్రాక్టర్లు, అధికారులు బిల్లులు ఎత్తుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
పంచాయతీ పరిధిలో చేపట్టే నామినేటెడ్ పనులకు విలేజ్ డెవలప్మెంట్ కమిటీ అనుమతి తప్పనిసరి. ఈ పనులను మమ్మల్ని సంప్రదించకుండానే అధికారులు, కాంట్రాక్టర్లు ప్రారంభించారు. అధికారులు కూడా ఎలాంటి అగ్రిమెంట్ చేసుకోకుండా పనులు ప్రారంభించడంపై అనుమానాలున్నాయి. మమ్మల్ని ఆహ్వానించకుండా, వీడీసీ అనుమతి లేకుండా ఇష్టారాజ్యంగా పనులు ప్రారంభిస్తున్నారు. దీనిద్వారా పంచాయతీకి రావాల్సిన నిధులు రాకుండా పోతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించాలి.