వరంగల్, జనవరి 16 (నమస్తేతెలంగాణ): బినామీ డీలర్లను గుర్తించేందుకు అధికారులు రేషన్ దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. ఆయా రేషన్ షాపులో ఆర్డీవో జారీ చేసిన ఆథరైజేషన్ కాపీ, ఈ-పాస్ యంత్రంలోని పేర్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. డీలర్లలో బినామీలు ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం తనిఖీలకు ఆదేశించింది. ఈ మేరకు వరంగల్ జిల్లాలో ఉన్న 509 రేషన్ దుకాణాల్లో తనిఖీల నిర్వహణకు తాజాగా కలెక్టర్ ప్రావీణ్య 13 బృందాలను ఏర్పాటుచేశారు. తహసీల్దార్లతో పాటు ఏసీఎస్లు, డీటీసీఎస్లు, యూడీఆర్ఐలు ఇందులో ఉన్నారు. ఆయా మండలంలోని తహసీల్దార్, జిల్లా పౌర సరఫరాల అధికారి కార్యాలయంలోని క్షేత్రస్థాయి సిబ్బంది విధిగా తనిఖీల్లో పాల్గొనేలా ప్రణాళిక రూపొందించారు. దీంతో జిల్లాలో మంగళవారం అధికారులు తనిఖీలు ప్రారంభించారు. తొలిరోజు ఉర్సుగుట్టలోని రేషన్ షాపుల్లో తనిఖీలు చేశారు. జిల్లా పౌరసరఫరాల అధికారి చందన్కుమార్తో పాటు ఏసీఎస్వో ఇందులో పాల్గొన్నారు.
ఇలా జిల్లాలోని ప్రతి దుకాణాన్ని తనిఖీ చేస్తామని, ఎక్కడైనా బినామీ డీలర్ ఉన్నట్లు రుజువైతే సదరు వ్యక్తిపై 6ఏ కేసుతో పాటు క్రిమినల్ కేసు నమోదు చేస్తామని చందన్కుమార్ వెల్లడించారు. అలాగే బియ్యం నాణ్యతను పరిశీలించి, నాణ్యమైనవి సరఫరా చేయకపోతే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. తనిఖీ నివేదికలను ఎప్పటికప్పుడు కలెక్టర్కు అందజేస్తామని చెప్పారు. తనిఖీ సమయంలో దుకాణంలో ఒరిజినల్ డీలర్ మాత్రమే దుకాణం నిర్వహించాలని, రికార్డుల ప్రకారం నిల్వలు ఉండాలని, ఈ-కేవైసీ డేటాను వంద శాతం పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించినట్లు చందన్కుమార్ చెప్పారు. ప్రతి డీలర్ తమ దుకాణం వివరాలు, జిల్లా పౌరసరఫరాల అధికారి, సంబంధిత తహసీల్దార్, నాయబ్ తహసీల్దార్(సివిల్ సప్లయ్) మొబైల్ నంబర్లతో కూడిన బోర్డు, టోల్ఫ్రీ నంబర్ 1937 వినియోగదారులకు స్పష్టంగా కనిపించేలా ప్రదర్శించి, ఆథరైజేషన్ కాపీ, ధరల పట్టికను కూడా ఏర్పాటు చేయాలని, తుకానికి లీగల్ మెట్రాలజీ స్టాంప్ ఉండాలని ఆయన స్పష్టం చేశారు.