వరంగల్, నవంబర్ 23: గ్రేటర్ వరంగల్ పరిధిలో కోతుల బెడద నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. కోతులను బంధించేందుకు టెండర్ ఖరారైన నేపథ్యంలో గ్రేటర్ పరిధిలోని అన్ని డివిజన్లలో ప్రణాళికాబద్ధంగా కోతులను బంధించే ప్రక్రియను చేపట్టాలన్నారు. వివిధ డివిజన్ల పరిధిలో బంధించిన కోతులను బుధవారం కార్పొరేషన్ కార్యాలయ ఆవరణకు తీసుకురాగా ఆమె పరిశీలించారు.
బంధించిన కోతులను ఏటూరునాగరం అటవీ ప్రాంతానికి తరలించాలన్నారు. ఇప్పటి వరకు 792 కోతులను బంధించామని, వాటిలో 520 కోతులను అటవీ ప్రాంతానికి తరలించామని, మిగిలిన 272 కోతులను త్వరలోనే అడవికి తరలిస్తామని అధికారులు మేయర్కు వివరించారు. వాటిని అడవికి తరలించే వరకు ఆహారం అందించాలన్నారు. ఆమె వెంట చీఫ్ ఎంహెచ్వో డాక్టర్ జ్ఞానేశ్వర్, ఎంహెచ్వో డాక్టర్ రాజేశ్, శానిటరీ సూపర్వైజర్ సాంబయ్య, శానిటరీ ఇన్స్పెక్టర్ గోల్కొండ శ్రీనివాస్, కోతులను బంధించే శివయ్య, బాషా, నాగరాజు, హరికృష్ణ, వెంకటకృష్ణ ఉన్నారు.