అవి రెండు బడులూ ఒకప్పుడు వేర్వేరుగా నడిచాయి. ప్రాథమిక, ఉన్నత పాఠశాలలుగా సేవలందించాయి. తెలుగు మాధ్యమంలో బోధన ఉన్నప్పుడు విద్యార్థుల ఆదరణ అంతంతే ఉండేది. ప్రభుత్వం చొరవతో కొత్త భవనంలోకి మారిన తర్వాత మాసూమ్ అలీ, మౌలాలి సర్కారు స్కూళ్లు ఇప్పుడు ఇంగ్లిష్ మీడియంలో నడుస్తూ 290 మంది విద్యార్థులతో కళకళలాడుతున్నాయి.
– పోచమ్మమైదాన్, ఫిబ్రవరి 26
ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలకు తోడు దాతలు కూడా పాఠశాలకు తోడ్పాటునందిస్తున్నారు. పన్యాల రవీందర్రెడ్డి వాటర్ ఫ్రీజర్, డాక్టర్ పీ సారంగపాణి కుట్టు మిషన్, లయన్స్ క్లబ్ ఆఫ్ పోతన తరఫున రూ.20వేలు, వాసవీ క్లబ్ ఎవర్ గ్రీన్ తరఫున బీరువా, జూనియర్ అసిస్టెంట్ జీ ధనుంజయ మూడు సైకిళ్లు, రోటరీ క్లబ్ వరంగల్ సెంట్రల్ తరఫున ప్రొజెక్టర్, డాక్టర్ అల్లం వేణుమాధవ్ ఆరు కార్పెట్లు అందజేశారు. వన్నాల ఖన్నా రూ.75వేల విలువైన బెంచీలు సమకూర్చారు. మాదారపు శబరీనాథ్ రెండేళ్లపాటు బతుకమ్మ పండుగ సందర్భంలో విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేశారు. స్థానిక కార్పొరేటర్ సురేష్ కుమార్ జోషీ, ఆడెపు రవీందర్, ఆకుల మహేశ్, డాక్టర్ సుమన్ శర్మ, పుల్లూరు మధు, గుజ్జారి శ్రీధర్బాబు, గుజ్జారి రమేశ్, సునీత, నూతన్, అల్లం వేణుమాధవ్ తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. పాఠశాలకు విరాళాలు అందించిన దాతల పేర్లను, ముఖ్య అధికారుల సెల్ నంబర్లను, పాఠశాల సమయం వివరాలను తెలిపేలా పెయిటింగ్ వేయించారు.
వరంగల్ నగరంలోని గిర్మాజీపేటలో ఒకప్పుడు మాసూమ్ అలీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను అద్దె భవనంలో నడిపారు. కొన్నాళ్ల తర్వాత అక్కడి నుంచి గోవిందరాజుల గుట్ట ఏరియాకు మార్చారు. నాడు తెలుగు మీడియంలోనే ఉండడంతో 50 నుంచి 100లోపే విద్యార్థుల సంఖ్య ఉండేది. తర్వాత అక్కడి నుంచి ఎల్బీనగర్లోని ప్రభుత్వ మౌలాలి ప్రాథమిక పాఠశాల ఆవరణలోకి మార్చారు. కానీ, ఇక్కడ ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు నడిపే వసతి లేకపోవడంతో మాసూమ్ అలీ ఉన్నత పాఠశాలను చింతల్కు మార్చారు. ప్రాథమిక పాఠశాలను ఎల్బీ నగర్లోనే కొనసాగించారు.
రెండు పాఠశాలలు వేర్వేరుగా నడవడం వల్ల తరగతి గదుల కొరత ఏర్పడింది. దీంతో ప్రభుత్వం మౌలాలి పాఠశాల భవనం మొదటి అంతస్తులో తరగతి గదులు నిర్మించాలని నిర్ణయించింది. 2016-2017లో ముఖ్యమంత్రి హామీ పథకం కింద మంజూరైన రూ.30లక్షలతో కొత్త గదులు నిర్మించారు. ప్రత్యేకంగా ఐదు తరగతి గదులు ఏర్పాటు చేయడంతో 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు సదుపాయం కలిగింది. ఇప్పుడు మొదటి అంతస్తులో మాసూమ్ అలీ ఉన్నత పాఠశాల, గ్రౌండ్ ఫ్లోర్లో మౌలాలి ప్రాథమిక పాఠశాల నడుస్తున్నాయి.
నాడే తెలుగు నుంచి ఆంగ్లం వైపు..
నాడు రెండు పాఠశాలలూ తెలుగు మీడియంలో ఉండడంతో విద్యార్థుల సంఖ్య నామమాత్రంగానే ఉండేది. దీనికి తోడు చుట్టూ కార్పొరేట్ పాఠశాలలు ఉండడంతో విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఉపాధ్యాయులు ఎంత ప్రచారం చేసినా విద్యార్థుల సంఖ్య వంద దాటడం గగనంగా ఉండేది. ఈ నేపథ్యంలో తల్లిదండ్రుల కోరిక మేరకు ఇంగ్లిష్ మీడియం ఏర్పాటు చేయాలనుకున్నారు. తొలుత ప్రాథమిక పాఠశాలలో 2016 నుంచి ఇంగ్లిష్ మీడియానికి శ్రీకారం చుట్టారు. విద్యార్థుల కోసం డ్యుయెల్ డెస్క్లు, టాయ్లెట్స్ ఏర్పాటు చేయడంతో హాజరుశాతం పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం ప్రైమరీ స్థాయిలో 140 మంది విద్యార్థులు చదువుతున్నారు. 2018లో 6వ తరగతి నుంచి పదో తరగతి వరకు ఇంగ్లిషు మీడియాన్ని ప్రవేశపెట్టారు. ఈ ఏడాది పదో తరగతి తెలుగు మీడియం బ్యాచ్ పూర్తయితే ఇక వచ్చే విద్యా సంవత్సరం నుంచి పూర్తిగా ఆంగ్ల మాధ్యమంలోనే బోధన అందనుంది.