చిట్యాల, ఏప్రిల్ 18: ఛత్తీస్గఢ్ అడవుల్లో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన 29 మంది మావోయిస్టుల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగె గ్రామానికి చెందిన సిరిపెల్లి సుధాకర్ అలియాస్ శంకర్రావు ఉన్నట్లు ఆయన కుటుంబసభ్యులు గుర్తించారు. ఘటనా స్థలానికి గురువారం మధ్యాహ్నం చేరుకున్న వారు మృతదేహాన్ని పరిశీలించి సిరిపెల్లి సుధాకర్గా ధ్రువీకరించారు. ఆయన భార్య సుమన అలియాస్ రజిత కూడా మృతి చెందగా, సరైన ఆధారాలు లేక ఆమె మృతదేహాన్ని వీరికి అప్పగించడానికి పోలీసులు నిరాకరించినట్లు తెలిసింది. గురువారం అర్ధరాత్రి శంకర్రావు మృతదేహం చల్లగరిగె గ్రామానికి వస్తుందని, శుక్రవారం అంత్యక్రియలు జరుపనున్నట్లు గ్రామస్తులు తెలిపారు.
చల్లగరిగె గ్రామానికి చెందిన సిరిపెల్లి ఓదెలు-రాజపోచమ్మ దంపతుల కుమారుడు సుధాకర్ స్థానికంగా 9వ తరగతి చదువుతున్న క్రమంలో తన చిన్నమ్మ కుమారుడు కలికోట శంకర్తో కలిసి పీపుల్స్వార్ పార్టీలో సానుభూతిపరుడిగా పనిచేసి 2000 సంవత్సరంలో అజ్ఞాతంలోకి వెళ్లాడు. సుధాకర్ తండ్రి ఓదెలు 15 యేళ్ల కిందట మృతి చెందాడు. సుధాకర్ ఉమ్మడి అదిలాబాద్కు చెందిన సుమన అలియాస్ రజితను వివాహం చేసుకోగా, ఎన్కౌంటర్లో భార్యాభర్తలు మృతి చెందడంతో రాజపోషమ్మ, కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. 22 ఏళ్ల సుదీర్ఘంగా మావోయిస్టు నేతగా ఎదిగి మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. శంకర్రావు మృతితో చల్లగరిగె ఉద్యమకారుల ప్రస్థానం ముగిసింది 1990 దశకంలో పోషాల తిరుపతి, మహేశ్, కలికోట శంకర్ విప్లవకార్ల ఉద్యమంలో అసువులు బాశారు. అదే గ్రామానికి చెందిన రౌతు విజేందర్ అలియాస్ శ్రీనివాస్ ఛత్తీస్గఢ్లో జిల్లా నాయకుడిగా పనిచేస్తూ 2019 ఎన్కౌంటర్లో మృతి చెందాడు.
జయశంకర్ భూపాలపల్లి, ఏప్రిల్ 18(నమస్తే తెలంగాణ): ఛత్తీస్గఢ్లోని బస్తర్ రీజియన్లోని కాంకేర్ జిల్లా అడవుల్లో గడిచిన పదిహేను రోజుల్లో జరిగిన రెండు ఎన్కౌంటర్లలో ఇద్దరు మావోయిస్టు నేతలు నేలకొరిగారు. ఇద్దరూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా వాసులే. పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి ఎన్కౌంట ర్లలో నేలకొరిగారు. ఈ నెల 6న జరిగిన ఎన్ కౌంటర్లో దండకారుణ్యం జోనల్ కమిటీ సెకండ్ సీఆర్సీ (సెంట్రల్ రీజినల్ కమిటీ)కమాండర్ అన్నె సంతోష్ అలియాస్ సాగర్ అలియాస్ శ్రీధర్ మృతి చెందాడు. ఈయన కాటారం మండలం అంకుశాపురం గ్రామానికి చెందిన వాడు. 20 ఏళ్ల క్రితమే అజ్ఞాతంలోకి వెళ్లి మావోయిస్టు పార్టీలో కీలక నేతగా ఎదిగాడు. అలాగే మంగళవారం రాత్రి జరిగిన ఎన్కౌంటర్లో చిట్యాల మండలం చల్లగరిగె గ్రామానికి చెందిన సిరిపెల్లి సుధాకర్, అతని భార్య సుమన మృతి చెందారు. అలాగే ఈ ఎన్కౌంటర్లో చిట్యాల మండలం రామచంద్రాపురానికి చెందిన దళ సభ్యుడు రాజు సైతం మృతి చెందినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు పోలీసులు ధ్రువీకరించడం లేదు. భూపాలపల్లి జిల్లాకు చెందిన ఇద్దరు మావో కీలక నేతలు ఒకే ప్రాంతంలో వేర్వేరు ఎన్కౌంటర్లలో మృతి చెందారు. కాగా నక్సల్స్ ప్రతీకార దాడులకు పాల్పడే అవకాశాలున్నట్లు భావించిన పోలీసులు అప్రమత్తమయ్యారు. సరిహద్దుల్లో ప్రత్యేక నిఘా పెట్టారు.