హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో 48 ఉపాధ్యాయ సంఘాలున్నట్టు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. వీటిలో 8 సంఘాలకు మాత్రమే ప్రభుత్వ గుర్తింపు ఉన్నట్టు తెలిపింది. మిగిలిన 48 రిజిస్టర్డ్ సంఘాలుగా వెల్లడించింది. పీఆర్టీయూ టీఎస్, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్), టీఎస్ జీహెచ్ఎంఏ, టీఆర్టీఎఫ్, టీఎస్ యూటీఎఫ్, ఎస్టీయూ టీఎస్, టీపీటీఎఫ్, టీఎస్ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్లు (టీఎస్ పీటీఏ) సంఘాలు మాత్రమే ప్రభుత్వ గుర్తింపు సంఘాలుగా విద్యాశాఖ వెల్లడించింది. ఉపాధ్యా సంఘాల సమాచారం కోరుతూ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు పద్మనాభరెడ్డి సమాచారం హక్కు చట్టం ద్వారా దరఖాస్తుచేయగా విద్యాశాఖ లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. ఈ సంఘాల్లో నాలుగింటికి మాత్రమే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో సభ్యత్వం ఉన్నట్టు విద్యాశాఖ తెలిపింది. ఒకే పేరుతో కాస్త పేరు మార్చుకుని పలు సంఘాలుండటం గమనార్హం.
రాష్ట్రంలో ఉపాధ్యాయ సంఘాల సంఖ్యను తగ్గించాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు పద్మనాభరెడ్డి సర్కార్ను కోరారు. సీఎం రేవంత్రెడ్డికి ఆయన లేఖ రాశారు. శాసనమండలిలో ముగ్గురు టీచర్ ఎమ్మెల్సీలు ఉన్నందున ఇన్ని సంఘాలు అవసరంలేదని పేర్కొన్నారు. ప్రభుత్వ గుర్తింపు పొందేందుకు 25% సభ్యత్వం ఉండాలనే నిబంధన ఉన్నదని, ఈ లెక్కన నాలుగు సంఘాలకు మాత్రమే గుర్తింపు దక్కే అవకాశమున్నదని, అయినా 8 సంఘాలకు గుర్తింపు దక్కిందని లేఖలో ప్రస్తావించారు.