ధర్మసాగర్, సెప్టెంబర్ 25 : స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకుల మాటలు నమ్మి ప్రజలు ఆగం కావొద్దని, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్ కూడా రాదని స్టేషన్ ఘన్పూర్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. ధర్మసాగర్ మండల కేంద్రంలోని సుష్మిత గార్డెన్లో గ్రామశాఖ అధ్యక్షుడు బొడ్డు సోమయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన గ్రామ విస్తృస్థాయి కార్యకర్తల సమావేశంలో కడియం శ్రీహరి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. జాతీయ పార్టీలకు జాతీయ విధివిధానాలు లేవని, రాష్ర్టానికో విధానాన్ని అమలు చేస్తూ చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.
లేవలేని స్థితిలో బీజేపీ ఉందని, ఆ పార్టీకి నాలుగైదు సీట్లు వస్తే మహా ఎక్కువన్నారు. వచ్చిరాని హామీలతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను ఆగం చేస్తున్నదని, ఆ పార్టీకి ఓటు వేసి ఆగం కావొద్దన్నారు. తుక్కుగూడ సభలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఏ మేరకు అమలు చేస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో అమలయ్యే పథకాలు దేశంలో ఎక్కడా అమలు కావడం లేదన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ గణనీయమైన అభివృద్ధి సాధిస్తోందన్నారు. కేసీఆర్ నాయకత్వాన్ని దేశ ప్రజలు కోరుకుంటున్నారన్నారు.
తెలంగాణలో రైతులకు అనేక పథకాలను ప్రవేశపెట్టి రైతును రాజును చేయడానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. దేశానికే అన్నం పెట్టే స్థాయిలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సాధించిందన్నారు. ఇది కేసీఆర్ దక్షతకు నిదర్శమన్నారు. రైతులకు రెండు దఫాలుగా రుణమాఫీ చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. ధర్మసాగర్ గ్రామాన్ని దత్తత తీసుకుని, రిజర్వాయర్ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తానని తెలిపారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఎంపీటీసీలు రొండి రాజు, జాలిగపు వనమాలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వారితో పాటు సూమారు 150 మంది కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు కడియం సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యం
బీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని, ఘన్పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరో కూడా ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులకు తెలియదని బీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ నాయకుడు రొండి రాజు యాదవ్ అన్నారు. కాంగ్రెస్లో కార్యకర్తల మోహం కూడా తెలియని నాయకులు ఓట్ల కోసం తిరుగుతున్నారని విమర్శించారు. ఘన్పూర్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాలను చూసే బీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో ఎమ్మెల్యేగా కడియం శ్రీహరిని భారీ మెజార్జీతో గెలిపించి అభివృద్ధిలో భాగస్వాములమవుతామని తెలిపారు.
ఆనంతరం ధర్మసాగర్లోని పునీత అంథోని చర్చిలో నూతన గురువుగా అభిషేకం పొందిన పుట్ట విజయ్ని కడియం శ్రీహరి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ ఎర్రబెల్లి శరత్చంద్రప్రసాద్, ఎంపీటీసీ బొడ్డు శోభ, మాజీ ఎంపీపీ ఎర్రబెల్లి వెంకటనర్సమ్మ, మాజీ జడ్పీటీసీ వాసు, ఉప సర్పం చ్ బొడ్డు అరుణ, మాజీ సర్పంచ్ కొలిపాక రజిత, రైతుబంధు సమితి కోఆర్డినేటర్ రెమిడి మహేందర్రెడ్డి, నాయకులు బొడ్డు ప్రభుదాస్, రావుల వెంకట్రెడ్డి పాల్గొన్నారు.