హనుమకొండ, మే 30 : నియోజకవర్గ వ్యాప్తంగా అదిరిపోయేలా తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలని వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ పిలుపునిచ్చారు. మంగళవారం హనుమకొండ హంటర్రోడ్డులోని విష్ణుప్రియాగార్డెన్లో మేయర్ గుండు సుధారాణి, పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావుతో కలిసి వర్ధన్నపేట నియోజకవర్గ స్థాయిలోని అన్ని శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులతో దశాబ్ది ఉత్సవాల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అరూరి రమేశ్ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించనున్న కార్యక్రమాల ఏర్పాట్లపై శాఖల వారీగా అధికారులు, ప్రజా ప్రతినిధులతో చర్చించారు. జూన్ 2 నుంచి 22 వరకు నిర్వహించే ఉత్సవాలను పండుగ వాతావరణంలో జరిపేందుకు చేయాల్సిన ఏర్పాట్లపై పలు సూచనలు ఇచ్చారు. అనంతరం అరూరి రమేశ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం గడిచిన తొమ్మిది ఏళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం మన కళ్ల ముందు కనిపిస్తున్నదన్నారు. సంక్షేమ రంగంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ఇప్పటి వరకు జరిగిన ప్రతి అభివృద్ధి పనిని, అందిన ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజలకు వివరించాలని సూచించారు. అన్ని వర్గాల ప్రజలను ఉత్సవాల్లో భాగస్వాములను చేస్తూ, ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని ఆయ న పిలుపునిచ్చారు. సీపీ రంగనాథ్ మాట్లాడుతూ దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేసేందుకు పోలీస్ శాఖ తరుఫున అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని హనుమకొండ, వరంగల్ జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.