వరంగల్చౌరస్తా/నర్సంపేట/చెన్నారావుపేట, మార్చి 1: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని వరంగల్ గిర్మాజీపేటలోని శివాంజనేయ ఆలయంలో తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ప్రత్యేక పూజలు చేశారు. మాజీ కార్పొరేటర్ జారతి రమేశ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని శివలింగానికి అభిషేకం చేశారు. 24వ డివిజన్ పరిధిలోని భోగేశ్వరాలయంలో ఎమ్మెల్యే శివపార్వతుల విగ్రహాలకు అభిషేకాలు నిర్వహించారు. అనంతరం రామన్నపేటలోని రామలింగేశ్వరాలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో నన్నపునేని పాల్గొని శివలింగానికి అభిషేకం చేశారు. అనంతరం బీజేపీ డివిజన్ నాయకుడు కొత్తకొండ రాము ఎమ్మెల్యే ఆధ్వర్యంలో టీఆర్ఎస్లో చేరారు. వరంగల్ స్టేషన్రోడ్లోని శ్రీకాశీవిశ్వేశ్వరాలయంలో ప్రధాన పూజారి లంకాశివకుమార్ ఆధ్వర్యంలో విశేష పూజా కార్యక్రమాలు చేపట్టారు. దేవస్థాన ఫౌండర్ ట్రస్టీ ఆకారపు హరీశ్కుమార్-స్వాతి దంపతుల ఆధ్వర్యంలో శివుడికి సుప్రభాతసేవ, గణపతి హోమం, మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేశారు. అనంతరం భక్తబృందం, ఆలయ సేవా సమితి సభ్యుల ఆధ్వర్యంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. స్థానిక డివిజన్ కార్పొరేటర్ కల్పన, ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్ వెంకట్రావు, అర్చకులు సత్యనారాయణశర్మ, జగన్మోహన్శర్మ, ఆలయ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. వరంగల్ పిన్నావారివీధిలోని దుర్గేశ్వరాలయంలో ప్రధానార్చకుడు కొత్తపల్లి మణికుమార్శర్మ ఆధ్వర్యంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. నర్సంపేట పట్టణంలో శివాలయాలకు భక్తులు పోటెత్తారు. శివాంజనేయస్వామి, అయ్యప్పస్వామి ఆలయాలను దర్శించుకున్నారు. పట్టణ పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. చెన్నారావుపేట మండలంలోని శ్రీభ్రమరాంబికా సమేత సిద్ధేశ్వరాలయం శివనామస్మరణతో మార్మోగింది. ప్రధానార్చకుడు భిక్షమాచార్యులు, పవన్కల్యాణ్శాస్త్రి, గణేశ్శాస్త్రి శాస్ర్తోక్తంగా పూజలు, అభిషేకాలు చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ కంది గోపాల్రెడ్డి-విజయ దంపతులు శివుడికి అభిషేకం చేశారు.
వర్ధన్నపేట/నర్సంపేటరూరల్/కరీమాబాద్: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆకేరువాగు ఒడ్డున ఉన్న శ్రీరాజరాజేశ్వరాలయంతోపాటు ఇల్లంద రామలింగేశ్వరాలయం, వర్ధన్నపేట పట్టణంలోని శివాలయం, ల్యాబర్తి, దమ్మన్నపేట, నల్లబెల్లి, కట్య్రాలలోని శివాలయాలను పాలక మండలి ప్రతినిధులు ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై శివలింగానికి అభిషేకాలు చేశారు. రాజేశ్వరాలయంలో శివపార్వతుల కల్యాణాన్ని అర్చకులు కనులపండువగా నిర్వహించారు. నర్సంపేట మండలంలోని మాదన్నపేట పెద్ద చెరువు కట్టపై కాకతీయుల కాలంలో వెలిసిన శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయంలో కమిటీ అధ్యక్షుడు మచ్చిక నర్సయ్యగౌడ్ ఆధ్వర్యంలో అర్చనలు, పూజలు కొనసాగాయి. రుద్రాభిషేకాలు, బిల్వార్చన తదితర విశేష పూజలను ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో నిర్వహించారు. భక్తుల జాగరణ కోసం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు మచ్చిక నర్సయ్యగౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నామాల సత్యనారాయణ, ఈర్ల నర్సింహరాములు, నాయకులు దర్శించుకున్నారు. గురిజాలలోని రామక్క రుద్రేశ్వరాలయం(మల్లన్నపాదాలు)లో గురిజాల, గుర్రాలగండిరాజపల్లి సర్పంచ్లు గొడిశాల మమతా సదానందం, తుత్తూరి కోమలా రమేశ్ ప్రత్యేక పూజలు చేశారు. వరంగల్ అండర్రైల్వేగేట్ ప్రాంతంలోని ఆలయాల్లో వేడుకలు ఘనంగా జరిగాయి. కరీమాబాద్ బొమ్మలగుడిలో పూజారి శివపురం రామలింగ ఆరాధ్య ఆధ్వర్యంలో పూజలు చేశారు. రంగశాయిపేట వడ్లవాడలోని రామలింగేశ్వరస్వామి ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. కార్పొరేటర్ గుండు చందన పాల్గొని పూజలు చేశారు. ఎస్ఆర్ఆర్తోటలోని దుర్గామల్లేశ్వరస్వామి ఆలయంలో పూజారి పాలకుర్తి ఆంజనేయశర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. బొమ్మలగుడిలోని గర్భగుడిలోకి సూర్యకిరణాలు పడినట్లు పూజారి శివపురం రామలింగ ఆరాధ్య తెలిపారు.
గీసుగొండ/నెక్కొండ/రాయపర్తి/పర్వతగిరి/కాశీబుగ్గ/నల్లబెల్లి: గీసుగొండ మండలంలో మహా శివరాత్రి వేడుకలు అంబరాన్నంటాయి. గీసుగొండ, ఎలుకుర్తి, విశ్వనాథపురం శివాలయాల్లో భక్తులు భారీగా తరలివచ్చి శివుడిని దర్శించుకున్నారు. గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్ కోటిలింగాల ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. అధికారులు, కార్పొరేటర్ సుంకరి మనీష ఏర్పాట్లు చేశారు. హర హర మహాదేవ.. శంభోశంకర నినాదాలతో నెక్కొండలోని శ్రీరామలింగేశ్వరాలయం, దీక్షకుంట, అలంకానిపేట, పెద్దకోర్పోలులోని శివాలయాలు మార్మోగాయి. రామలింగేశ్వరాలయంలో శివ కల్యాణోత్సవంలో భాగంగా అర్చకుడు బీవీఎన్శాస్త్రి ఆధ్వర్యంలో అర్చకులు అనుముల గోపాలకృష్ణమూర్తి, బూరుగుపల్లి శ్రావణ్శాస్త్రి, వరప్రసాద్శర్మ, సహజల్ యోదన్శాస్త్రి ఉత్సవమూర్తులకు విగ్రహాల దాత నంగునూరి శివయ్య-సావిత్రి, రామలింగేశ్వరస్వామి సేవా సమితి సభ్యులు గన్ను సత్యం, అనంతుల మురళీధర్, కొత్తకొండ గణేశ్, ధనిష్ట ఆధ్వర్యంలో పంచామృతాభిషేకాలు నిర్వహించారు. రాయపర్తి మండలంలోని 39 గ్రామాల్లో శివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. రాయపర్తిలోని రుద్రకోటేశ్వరాలయం, కొత్తరాయపర్తిలోని ఉమామహేశ్వరాలయం, కొండాపురంలోని చెన్నకేశవస్వామి ఆలయం, వెంకటేశ్వరపల్లి, పెర్కవేడు, కొండూరు, కాట్రపల్లిలోని శివాలయాల్లో వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ శివపార్వతుల కల్యాణోత్సవాలను కనులపండువగా నిర్వహించారు. పర్వతగిరి మండలంలోని గోపనపెల్లి శ్రీదూడెల మల్లికార్జునస్వామి ఆలయంలో స్వామి వారికి పెద్దపట్నం వేసే కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయాలు భక్తిపారవశ్యంతో ఓలలాడాయి. కొంకపాక శివాలయం భక్తులతో పోటెత్తింది. అర్చకుడు ప్రవీణ్ నేతృత్వంలో ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు చేశారు. తురుకల సోమారం, జమాల్పురంలోని శ్రీషిరిడీ సాయిబాబా మందిరంలో అర్చకుడు రమణాచారి, నిర్వాహకులు చందా శ్రీనివాస్ అభిషేకాలు, అర్చనలు చేశారు. ఏనుగల్ ధన్మెట్టు గుట్ట అభయాంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలను అర్చకుడు సముద్రాల వెంకటాచార్యుల నేతృత్వంలో నిర్వహించారు. పర్వతగిరి, కల్లెడ, వడ్లకొండ, చౌటపెల్లి, ఏనుగల్, చింతనెక్కొండ, అన్నారం షరీఫ్ గ్రామాల్లోని ఆలయాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి పూజలు చేశారు.
పోచమ్మమైదాన్: శివరాత్రి రోజు శివ జపం చేయడం వల్ల మోక్షం లభిస్తుందని శివానందమూర్తి కుమారుడు కందుకూరి రాజశేఖర్ అన్నారు. వరంగల్ ములుగురోడ్డులోని సప్తధామంలో మహాశివరాత్రి వేడుకలను మంగళవారం వైభవంగా నిర్వహించారు. శివానంద గురు కల్చరల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ ఉదయం లేవగానే శివశివ ఉంటూ స్మరిస్తే అనేక రేట్ల ఫలితం వస్తుందన్నారు. ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వేములవాడకు చెందిన కార్తికేయ అర్చకుడితో సహస్ర లింగార్చన (112 పార్థీవ లింగాలు), అభిషేకం, పుష్పార్చన, హారతిని భక్తుల సమక్షంలో చేయించారు. మధ్యాహ్నం శివపార్వతుల కల్యాణం నిర్వహించి, గురువైన శివానందుల శివరాత్రి సందేశాన్ని వీడియో ద్వారా చూపించామని మేనేజింగ్ ట్రస్టీ త్రిపురనేని గోపీచంద్ తెలిపారు. కార్యక్రమంలో గందె ఉమాశంకర్, రేపాల రామచందర్, రాంరెడ్డి, రాకేశ్, సదాశివుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుమారి శ్రీకుమారి ఆలపించిన కర్ణాటక సంగీతం భక్తులను ఆకట్టుకుంది. వాసవీమాత ఆలయంలో నిర్వహించిన వేడుకల్లో ఆర్య వైశ్య చైతన్యం పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుండా ప్రభాకర్ ఆధ్వర్యంలో పండ్లు పంపిణీ చేశారు. వరంగల్ 3వ డివిజన్ పైడిపల్లిలోని చంద్రమౌళీశ్వరస్వామి ఆలయంలో అభిషేకాలు, హోమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ జన్ను షీభారాణి-అనిల్కుమార్, హనుమకొండ పీఏసీఎస్ చైర్మన్ ఇట్యాల హరికృష్ణ ప్రత్యేక పూజలు చేశారు. అలాగే, 19వ డివిజన్ ఓసిటీరోడ్డులోని సీతారామాంజనేయస్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. ఆలయ మండప స్థలంలో ప్రత్యేకంగా శివలింగం ఏర్పాటు చేశారు. భక్తులతో ఆలయాలు కిక్కిరిసిపోయాయి. నల్లబెల్లి మండలం గుండ్లపహాడ్లోని శివాలయంలో రాజరాజేశ్వరుడికి భక్తులు ధూపదీప నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. సాయంత్రం ఆలయాల వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఎస్సై రాజారాపు రాజారాం పోలీసు బందోబస్తు చేపట్టారు.