మహబూబాబాద్ : మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని ఎంపీ మాలోతు కవిత అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని యశోద గార్డెన్స్ లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో ఎంపీ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ.. కుటుంబ సభ్యులు తమ పిల్లల్లో ఆడ, మగ అనే వ్యత్యాసం చూపెట్టకుండా సమానంగా ప్రోత్సహించాలన్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఎమ్మెల్యే, ఎంపీ అయ్యానని, ఇంటికే పరిమితం కాకుండా మీకు నచ్చిన రంగాన్ని ఎంచుకొని సక్సెస్ కావాలన్నారు.
సీఎం కేసీఆర్ మహిళలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారని అందుకు ప్రభుత్వ పథకాలు నిదర్శనం అని తెలిపారు. ఆడపిల్లల ప్రతి విషయంలో వారి మనోభావాలను గౌరవించి, వారిని ఎదగనివ్వాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ అంగోతు బిందు, ఎమ్మెల్యే శంకర్ నాయక్, జిల్లా కలెక్టర్ కె. శశాంక, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ ఉన్నారు.