శ్రీనగర్ : జమ్ముకశ్మీర్లో ఆదివారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సంభవించిన వివిధ ప్రమాదాల్లో మరణించినవారి సంఖ్య 28కి చేరింది. ప్రతికూల వాతావరణం కారణంగా అమర్నాథ్ యాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో వేలాదిమంది యాత్రికులు వివిధ క్యాంపుల్లోనే చిక్కుకుపోయారు. పహల్గామ్, బాల్తాల్ మార్గాల గుండా యాత్రికులు వెళ్లేందుకు అధికారులు అనుమతించడం లేదు.
ఈ ఏడాది యాత్ర ప్రారంభమైన మొదటి రెండు వారాల్లోనే 3.8 లక్షల మందికిపైగా భక్తులు గుహాలయాన్ని దర్శించుకున్నారు. రాబోయే రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఇది ఆకస్మిక వరదలకు దారితీసి, ప్రయాణాలకు అంతరాయం కలిగించవచ్చని భారత వాతావరణశాఖ(ఐఎండీ) హెచ్చరించింది.