అప్పుడు ఎన్టీ రామారావు, ఇప్పుడు సీఎం కేసీఆర్ ఇద్దరూ మహనీయులని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సోమవారం గోవిందరావుపేట మండలకేంద్రానికి చెందిన వీరపనేని శివాజీ విగ్రహాన్ని ఎంపీ మాలోత్ కవితతో కలిసి ఆయన ఆవిష్కరించారు. మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ శివాజీ కృషితోనే మండలకేంద్రంగా ఏర్పడిందన్నారు. అంతేకాకుండా ఉమ్మడి రాష్ట్రంలోనే సొంతూరిలో 400 ఇండ్లు కట్టించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ములుగును జిల్లాగా ఏర్పాటు చేయడమే కాకుండా అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారన్నారు. రూ.55కోట్లతో 300 పడకల దవాఖానను జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్నారన్నారు. రాబోయే ఆర్థిక సంవత్సరంలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయనున్నారని మంత్రి గుర్తు చేశారు. ఇప్పటికే పర్యాటక రంగంలో ములుగుకు దేశవ్యాప్త గుర్తింపు లభించిందన్నారు.
గోవిందరావుపేట, నవంబర్ 21 : రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన మహనీయులు ఇద్దరని అందులో ఒకరు నాటి దివంగత సీఎం ఎన్టీ రామారావు, నేటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. గోవిందరావుపేట గ్రామానికి చెందిన వీరపనేని శివాజీ విగ్రహాన్ని ఆయన కుమారులు రామకృష్ణ-సునీత(సినీ గాయని), రవికాంత్-సుధారాణితో పాటు శివాజీ సతీమణి భాగ్యలక్ష్మీ ఏర్పాటు చేయగా ఎంపీ మాలోత్ కవితతో కలిసి మంత్రి దయాకర్రావు ఆవిష్కరించారు. అంతేకాకుండా శివాజీ జ్ఞాపకార్థం రూ.20 లక్షల వ్యయంతో కొత్తగా నిర్మించిన గ్రామ పంచాయతీ కమ్యూనిటీ భవనాన్ని మంత్రి, ఎంపీ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ ఎన్టీఆర్ రూ.2 కిలో బియ్యం, పింఛన్, పేదల అభివృద్ధికోసం పాటు పడి రాష్ట్ర ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతు బంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి, రూ.2 వేల పింఛన్ ఇచ్చి నేడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు నేడు రాష్ట్ర ప్రజల గుండెల్లో దేవుడిగా నిలిచారన్నారు. శివాజీ మృతి గోవిందరావుపేట మండలానికి తీరని లోటన్నారు. మండలకేంద్రంగా ఏర్పాటు చేశారన్నారు. శివాజీ 75వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని తన చేతుల మీదుగా ఆవిష్కరించడం ఎంతో గర్వంగా ఉందన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో గోవిందరావుపేట మం డలకేంద్రంలో శివాజీ కృషితోనే ఎన్టీఆర్ హయాం లో 400 ఇండ్లు మంజూరైనట్లు చెప్పారు. గ్రామంగా ఉన్న గోవిందరావుపేటను మండలంగా ఏర్పాటు చేసింది కూడా శివాజీనేని మంత్రి కొనియాడారు. నేడు సీఎం కేసీఆర్ ములుగును జిల్లాగా ఏర్పాటు చేసి అన్ని రంగా ల్లో అభివృద్ధి చేస్తున్నారన్నారు. రూ.55 కోట్లతో 300 పడకల దవాఖానను జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్నారని చెప్పారు. రాబోయే ఆర్థిక సంవత్సరంలో మెడికల్ కళాశాలను కూడా ఏర్పాటు చేస్తున్నారని గుర్తు చేశారు.
గోవిందరావుపేట గ్రామంలోని అన్ని వీధులను సీసీలుగా మార్చిన అనంతరం మండలంలో పంచాయతీరాజ్ శాఖ ద్వారా అన్ని అంతర్గత రోడ్లను సైతం సీసీలుగా మార్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. జిల్లా మొత్తం కూడా సీసీ రోడ్ల నిర్మాణానికి కృషి చేస్తామని వివరించారు. పర్యాటక ప్రాంతంగా ములుగు జిల్లా ఎంతో అభివృద్ధి చెందే అవకాశం ఉందని, రామప్ప, లక్నవరం, బొగత వంటి పర్యాటక ప్రాంతాలతో ఇప్పటికే ములుగు జిల్లాకు దేశ వ్యాప్తంగా మంచి పేరు లభించిందని మంత్రి అన్నారు. మండల అభివృద్ధికి తమవంతు సాయం అందించాల ని శివాజీ కుటుంబ సభ్యులను మంత్రి కోరారు.
అనంతరం వీరపనేని శివాజీ జీవన ప్రస్థానం పుస్తకంతో పాటు పాటల సీడీని ఆవిష్కరించారు. కార్యక్రమంలో రెడ్కో చైర్మన్ ఏరువ సతీశ్రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, మాజీ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్, కలెక్టర్ ఎస్ కృష్ణఆదిత్య, ఏఎస్పీ సుధీర్రామ్నాథ్కేకన్, గ్రామస్తులు పాల్గొన్నారు. కాగా, మంత్రి పర్యటన సందర్భంగా సీఐ శంకర్, ఎస్సై కరుణాకర్రావు పోలీస్ సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు.