మరిపెడ : ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న పల్లె దవాఖానలతో మారుమూల పల్లె, గిరిజన గూడెం గిరిజనులకు ఎంతో మేలు జరుగనుందని డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్. రెడ్యానాయక్ అన్నారు. సోమవారం మున్సిపల్ కేంద్రంలో పలువురికి సీఎం సహాయ నిధి చెక్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సురక్షితమైన ప్రభుత్వ వైద్యం అందించటం లక్ష్యంగా సీఎం కేసీఆర్ పల్లె దవాఖాన ఏర్పాట్లకు శ్రీకారం చుట్టారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్య ఉప కేంద్రాల్లో వైద్యులను కాంట్రాక్ట్ పద్ధతిన నియమించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని దీంతో అందరికి అందుబాటులో వైద్యం అందనుందని వివరించారు.
ఇప్పటికే పీహెచ్సీలను బలోపేతం చేసి ఉచిత ప్రసవాలు, దీర్ఘకాలిక రోగులకు వైద్య సేవలు అందిస్తున్న సర్కార్ మరోఅడుగు ముందుకు వేసి పల్లె ముంగిట సురక్షిత వైద్యం అందించడం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ గుగులోతు అరుణ, మున్సిపల్ చైర్మన్ గుగులోతు సింధూరకుమారి, జిల్లా రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు డీఎస్. రవిచంద్ర, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కుడితి మహేందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ వెంకన్న, జిల్లా నాయకులు గుగులోతు రాంబాబు, తేజవత్ రవీంద్రనాయక్, జిల్లా మైనార్టీ సెల్ నాయకులు ఎండి. అయూబ్ పాషా పాల్గొన్నారు.