మహబూబాబాద్ : జూన్ 3 నుంచి నిర్వహించే పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు విజయవంతం చేయాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రజాప్రతినిధులను, అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్ లో మంత్రి సత్యవతి ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టర్ తో కలిసి 5 వ విడత పల్లె ప్రగతి, 4వ విడత పట్టణ ప్రగతి సన్నాహక సమావేశం నిర్వహించారు. కార్యాచరణ ప్రణాళికపై సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో గ్రామాలు, పట్టణాల అభివృద్ధి అద్భుతంగా జరుగుతుందన్నారు. మూడో తేదీ నుంచి ప్రారంభం కానున్న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. రాష్ట్రానికి అందాల్సిన ఉపాధి హామీ పేమెంట్స్ రాకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని, సర్పంచులకు అందాల్సిన పేమెంట్స్ రెండు, మూడు రోజులల్లో వారి అకౌంట్లలో జమ అవుతాయన్నారు.
సీఎం కేసీఆర్ ఆశయాలు, ఆలోచనకు అనుగుణంగా పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను ప్రజా ప్రతినిధులు, అధికారులు కలిసి కట్టుగా సమర్థవంతంగా నిర్వహించి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మండల, గ్రామ స్థాయిల్లో అధికారులంతా గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా సయుక్తంగా విధులు నిర్వహించి గ్రామీణాభివృద్ధిలో జిల్లా ఆదర్శంగా నిలిచేలా చూడాలని అన్నారు.
అనంతరం పల్లె ప్రగతి కార్యక్రమం 5వ విడత కార్యాచరణ రోజువారి నిర్వహించు కార్యక్రమాల వివరాలతో కూడిన పాంప్లెట్ ను మంత్రి ప్రజాప్రతినిధులు, కలెక్టర్ తో కలిసి ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ అంగోతు బిందు, ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్, ఎమ్మెల్యే శంకర్ నాయక్, మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, జిల్లా పరిషత్ సీఈఓ రమాదేవి, డి.పి. ఓ. సాయి బాబా తదితరులు పాల్గొన్నారు.