తొర్రూరు : ఫిబ్రవరి 11న జనగాంలో జరగబోయే సీఎం కేసీఆర్ సభకు మేడారం జాతరకు తరలివచ్చినట్టుగా అందరూ రావాలని మంత్రి సత్యవతి రాథోడ్ కోరారు. సీఎం కేసీఆర్ సభ ఏర్పాట్లపై తొర్రూరు, పెద్దవంగరలో ఏర్పాటు చేసిన సమావేశంలో స్థానికి ప్రజా ప్రతినిధులు, నేతలతో కలిసి మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ మీద, టీఆర్ఎస్ పార్టీ మీద కాంగ్రెస్, బీజేపీ నేతలు వారి స్థాయికి మించి అవాకులు, చెవాకులు మాట్లాడుతున్నారు. ప్రజల్లో లేని నాయకులు రాజకీయ ఉనికి కోసం చిల్లర మాటలతో చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. కొంతమందికి రాజకీయాలే బతుకు అయిపోయింది. ఈ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత మొదటిసారి టీఆర్ఎస్ పార్టీకి 63 సీట్లు వస్తే… వారి పాలన దక్షత, సంక్షేమం, అభివృద్ధి చూసిన తర్వాత రెండోసారి సాధారణ ఎన్నికల్లో 88 సీట్లు ఇచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ పరిపాలన కొనసాగుతోంది.. అని సత్యవతి అన్నారు.
గత ప్రభుత్వాలు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను విడదీసి పాలించాయి. ప్రజలు ఓట్లు వేయలేదని వారు ఏదో నేరం చేసినట్లు, పాపం చేసినట్లు సంక్షేమానికి దూరం చేశాయి. కానీ సీఎం కేసీఆర్ అందరి సంక్షేమం కోసం ఎలాంటి వివక్ష లేకుండా పాలిస్తున్నారు. అన్ని వర్గాల సంక్షేమానికి పాటుపడుతున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత రైతుల కోసం రైతు బంధు, రైతు బీమా, 24 గంటల నాణ్యమైన విద్యుత్, పుష్కలమైన నీరు ఇస్తూ, నీటి తీరువా పన్ను కూడా రద్దు చేశారు.
ఒకప్పుడు కలిగిన కుటుంబాలకు తప్ప వరి అన్నం దొరికేది కాదు. కానీ నేడు 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మనం పండిస్తున్నాం అంటే ఎక్కడ ఉన్న తెలంగాణ ఎక్కడకు వెళ్లింది. ఒకప్పుడు 30 లక్షల ఎకరాల్లో సాగు చేస్తే నేడు కోటి 10 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నాం. దేశాన్ని ఎక్కువ కాలం పాలించింది కాంగ్రెస్.. ఏడేళ్లుగా పాలిస్తోంది బీజేపీ. రాష్ట్రంపై ఇప్పుడు బీజేపీ సవతి తల్లి ప్రేమ చూపిస్తోంది. తెలంగాణకు గిరిజన విశ్వవిద్యాలయం, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, విభజన చట్టంలోని హామీలు నెరవేర్చడం లేదు. అసాధ్యమనుకున్న కాళేశ్వరం ప్రాజెక్టును సుసాధ్యం చేసి, లక్షల ఎకరాలకు రెండు పంటలకు నీరు ఇచ్చే దానికి, పాలమూరు ప్రాజెక్టుకు, దక్షిణ కుంభమేళా వంటి అతిపెద్ద గిరిజన పండగ మేడారం జాతరకు జాతీయ హోదా ఇవ్వడం లేదు.. అని బీజేపీ వైఖరిపై మంత్రి మండిపడ్డారు.
తెలంగాణలో 2011 జనాభా లెక్కల ప్రకారం గిరిజనులు 9.08 శాతం ఉన్నారు. కేంద్రాన్ని మా రిజర్వేషన్ 10 శాతం పెంచమన్నాం. కేంద్రం మా రిజర్వేషన్ పెంచకపోయినా… తెలంగాణ బడ్జెట్లో గిరిజనులకు 10 శాతం కేటాయిస్తున్నాం. 2021-22 సంవత్సరంలో తెలంగాణలో 12,304 కోట్ల రూపాయలు గిరిజన సంక్షేమ శాఖకు కేటాయించాం. దేశంలో గిరిజనులకు 8501 కోట్ల రూపాయల బడ్జెట్ ఇచ్చారు. దీనిని బట్టి గిరిజనులంటే ఎంత చిన్న చూపు ఉందో తెలుస్తోంది. రిజర్వేషన్లు పొందే ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్ముతున్నారు. రాజ్యాంగాన్ని మారుస్తామంటే ఉలిక్కిపడే మీరు రాజ్యాంగాన్ని అమలు చేయడం లేదు, దళితులు, గిరిజనుల జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వడం లేదు. దళితుల వర్గీకరణ చేయమంటే చేయడం లేదు, అందుకే రాజ్యాంగాన్ని మార్చాలి అని సీఎం కేసీఆర్ అన్నారు. వీటికి సమాధానం చెప్పలేక ముఖ్యమంత్రిని, టీఆర్ఎస్ను విమర్శిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు మనం చేసిన పనులు గట్టిగా చెప్పాలి. సోషల్ మీడియా ద్వారా కొంతమంది అబద్ధాలు బాగా ప్రచారం చేస్తున్నారు. వీటిని తిప్పి కొట్టాలి. అలాగే కేసీఆర్ జనగాం సభను దిగ్విజయం చేయాలి.. అని మంత్రి స్పష్టం చేశారు.