మహబూబాబాద్ : ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. ఇస్తారన్న ఆశ కూడా లేదని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఎర్రబెల్లి ట్రస్ట్ అధ్వర్యంలో తొర్రూరులో నిర్వహిస్తున్న నిరుద్యోగులకు ఉచిత ఉపాధి, ఉద్యోగ శిక్షణ శిబిరంలో మెటీరియల్ పంపిణీ చేసి మాట్లాడారు.
నిరుద్యోగుల కోసం తెలంగాణ ప్రభుత్వం భారీగా నోటిఫికేషన్లు విడుదల చేసిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే లక్ష్యా 30 వేల ఉద్యోగాలు ఇచ్చాం. తాజాగా 85 వేల ఉద్యోగాల భర్తీ చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. గత కొన్నేండ్లుగా ఉషా దయాకర్ రావు అధ్వర్యంలో ఎర్రబెల్లి ట్రస్ట్ సేవ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
కరోనా సమయంలో నిరుపేదలకు నిత్యావసర వస్తువులు, అంబులెన్స్ లు వంటివి ఎన్నో చేశాం. అలాగే ఇప్పుడు ఉచిత ఉపాధి, ఉద్యోగ శిక్షణ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నాం. ఎర్రబెల్లి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని మంత్రి ఆకాంక్షించారు.