మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కందికొండ గ్రామ శివారులోని కందగిరి పర్వత శిఖరంపై బుధవారం లక్ష్మీనరసింహస్వామి జాతర జరగనుంది. ఏటా కార్తీక పౌర్ణమి రోజున జాతర నిర్వహించడం ఆనవాయితీ. ఈ ఏడాది సంపూర్ణ చంద్రగ్రహణం ఉండడంతో మంగళవారం జరుగాల్సిన జాతర బుధవారానికి వాయిదా వేశారు. కందగిరి లక్ష్మీనరసింహస్వామి మహిమాన్వితుడిగా.. కోరిన కోరెలు తీర్చే దేవదేవుడిగా భక్తుల పూజలందుకుంటున్నాడు. కురవి మండలకేంద్రం నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో కందగిరి పర్వతం ఉంటుంది.
ప్రకృతి అందాలకు నెలవు..
ప్రకృతి రమణీయత నెలవు కందగిరి. పచ్చని చెట్లు.. గుట్టలు… ఆయుర్వేద మూలికలకు సంబంధించిన చెట్ల సువాసనలతో భక్తిపారవశ్యంతో మమేకమవుతారు. సెలయేర్లు, నీటి దొనలు, లోయలు ప్రకృతి ప్రేమికులను కట్టిపడేస్తాయి. గుట్టపైకి ఎక్కువగా వచ్చే యువతతో ఆ ప్రాంతమంతా సందడిగా ఉంటుంది. కందగిరిపై జరిగే జాతరకు అశేష భక్తజనం తరలివస్తారు. గుట్టపైకి ఎక్కేందుకు దారులు లేకున్నా.. పట్టుతప్పితే పడిపోతామనే భయమే లేకుండా స్వామివారిని స్మరించుకుంటూ భక్తులు వెళ్లిపోతుంటారు. కపిలవాయి మహాముని ఈ గుట్టపై తపస్సు చేయడం వల్లే కందగిరి అని పేరు వచ్చిందంటారు. గుట్టపై కంది మహావృక్షం ఉండేదని అందుకే ఈ కందగిరి అని పేరు వచ్చినట్లు చరిత్రకారులు చెబుతుంటారు.
కోరిన కోర్కెలు తీర్చే దేవదేవుడు.. ప్రకృతి పుట్ట రూపంలో భక్తులకు దర్శనమిచ్చే లక్ష్మీనరసింహుడు వెలసిన కందగిరి పర్వత శిఖరం మహిమాన్విత క్షేత్రంగా వెలుగొందుతోంది. చుట్టూ గుట్టలు, నీటి దొనలు, పచ్చని చెట్లతో ప్రకృతి రమణీయతకు నెలవైన కురవిలోని కందికొండ జాతరకు సర్వం సిద్ధమైంది. ఏటా కార్తీక పౌర్ణమి రోజున నిర్వహించాల్సి ఉండగా మంగళవారం చంద్రగ్రహణం కారణంగా ఒకరోజు ఆలస్యంగా జాతర నిర్వహిస్తున్నారు. అఖండ దీపం, కల్యాణ మహోత్సవాన్ని వీక్షించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు.
దీపదర్శనం అల్లంతదూరం
ఆలయ పూజారి కందికొండ గ్రామానికి చెందిన శాలివాహన కులస్తులతో కలిసి ఆలయ శిఖరంపై అఖండ దీపం వెలిగిస్తారు. ఆ అఖండ దీపం సుమారు 40 కిలోమీటర్ల వరకు కనిపిస్తుంది. గుట్ట ఎక్కలేనివారు.. ముసలివారు.. ఆ దీపాన్ని చూసి తన్మయత్వం పొందుతారు. ఈ ప్రాంతంలో కార్తీక పౌర్ణమి రాత్రివేళ ఇంటి ఎదుట దీపాలను వెలిగించి స్వామివారిని మనసారా వేడుకుంటారు.
ఏర్పాట్ల పరిశీలన
జాతర ఏర్పాట్లను జిల్లా ఉన్నతాధికారులు, ఆర్డీవో కొమురయ్య పర్యవేక్షిస్తుండగా జాతర పనులను సోమవారం ఎంపీపీ గుగులోత్ పద్మావతి మండల అధికారులతో పరిశీలించారు. భక్తులకు సౌకర్యాలు, ఏర్పాట్లపై సమీక్షించి కందికొండ-అయ్యగారిపల్లి గ్రామాల వైపు నుంచి భక్తులు వచ్చే దారులను, పరిసరాలను చూశారు. గుట్టపై ఎంపీవో రఘుపతిరెడ్డి, పంచాయతీ కార్యదర్శులు సతీశ్కుమార్, రఘువీర్, రంజిత్, సహదేవరాజు పరిసరాలను పరిశీలించారు. ఇక్కడ తహసీల్దార్ ఇమ్మాన్యూయేల్, ఎంపీడీవో సరస్వతి. ఏపీవో యాకాంబ్రం, ఏపీఎం కిరణ్కుమార్, సీరోలు ఎస్సై ఎల్.నరేశ్, పీహెచ్సీ వైద్యుడు గోపి పాల్గొన్నారు.
వాల్మీకి రూపంలో నరసింహస్వామి
కాకతీయుల కాలంలో వల్మీకం(పుట్ట) రూపంలో లక్ష్మీనరసింహస్వామి అవతరించి భక్తులకు దర్శనమిస్తున్నాడు. పర్వతంపైకి వెళ్లే భక్తులకు రెండు మార్గాలున్నాయి. ఒకటి అయ్యగారిపల్లి నుంచి వెళ్లి, మధ్యలో వేంకటేశ్వరస్వామిని దర్శించుకొని పర్వత శిఖరంపైకి చేరుకోవచ్చు. రెండోది కందికొండ నుంచి ఉండే ఈ దారి నేరుగా కందికొండ గుట్ట శిఖరంపైకి చేరుకుంటుంది. రెండు మార్గాల ద్వారా భక్తులు వచ్చేలా దారులను శుభ్రం చేయించారు.