స్టేషన్ఘన్పూర్, ఆగస్టు 2 : బదిలీపై వెళ్లిన పంచాయతీ కార్యదర్శికి ఎల్పీసీ (లాస్ట్ పేమెంట్ సర్టిఫికెట్) ఇవ్వడానికి స్టేషన్ఘన్పూర్ ఎంపీడీవో దేశగాని కుమారస్వామి రూ.లక్షా 40 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. వివరాల్లోకి వెళ్తే.. స్టేషన్ఘన్పూర్ మండలం శివునిపల్లి మేజర్ గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వర్తించిన సరుగు వెంకటకిశోర్ ఏడు నెలల క్రితం హనుమకొండ జిల్లా ఐనవోలుకు బదిలీ అయ్యా డు. వేతనం జమ కావాలంటే ఎంపీడీవో ఇచ్చిన లాస్ట్ పేమెంట్ సర్టిఫికెట్ (ఎల్పీసీ)ను ఐనవోలులో సమర్పించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఎల్పీసీ కోసం ఏడు నెలలుగా ఎంపీడీవో వద్దకు వెళ్తున్నా ఇవ్వడం లేదు. రూ.2 లక్షలు లంచం ఇస్తేనే సర్టిఫికెట్ ఇస్తానని వేధించాడు. చివరికి రూ.లక్షా 40 వేలు ఇచ్చేందుకు వెంకటకిశోర్ ఒప్పుకున్నాడు.
ఈ క్రమంలో సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో హనుమకొండలోని సుమంగళి ఫంక్షన్ హాల్ సమీపంలోకి డబ్బు తీసుకెళ్లి ఎంపీడీవోకు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. కుమారస్వామి స్వగ్రామం జనగామ జిల్లా కొడకండ్ల మండలం ఏడునూతుల. తాజా పరిస్థితుల్లో మంగళవారం ఏడునూతుల, హనుమకొండలోని కుమారస్వామి నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. సోమవారం రాత్రి 12 గంటల ప్రాంతంలో కుమారస్వామిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఎంపీడీవోతోపాటు పంచాయతీ కార్యదర్శి వెంకటకిశోర్ను సైతం అదే రాత్రి స్టేషన్ ఘన్పూర్ ఎంపీడీవో కార్యాలయానికి తీసుకొచ్చారు. కార్యాలయంలోని ఫైళ్లు, కంప్యూటర్లోని రికార్డులను పరిశీలించారు. అనంతరం ప్రభుత్వాసుపత్రిలో ఎంపీడీవోకు వైద్య పరీక్షలు నిర్వహించి హైదరాబాద్లోని నాంప ల్లి కోర్టుకు తరలించారు.