తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేండ్లు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ, గత అసెంబ్లీ ఎన్నికల్లో అనేక రాజకీయాలు, ఆరు గ్యారెంటీలు, హామీలు, బాండ్ పేపర్లు, దుష్ప్రచారాలు, అన్ని విధాలుగా ప్రజల మెదళ్లను చెడగొట్టి అధికారాన్ని చేజిక్కించుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే సహజంగానే తాము అన్ని విధాలా బాగుపడతామని ఆశించిన సగటు కాంగ్రెస్ కార్యకర్త తమ నాయకుల గెలుపుకోసం అహర్నిశలు కష్టపడ్డారు. తీరా వారు ఆశించిన విధంగానే ఆపార్టీ ఎమ్మెల్యే గెలుపొందడం, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం వచ్చినా కార్యకర్తలకు మాత్రం నిరాశే ఎదురవుతున్నది. క్షేత్రస్థాయిలో కష్టపడ్డ కార్యకర్తలను ప్రస్తుతం కదిలిస్తే వారి మాటల్లో అసహనం, అసంతృప్తి స్పష్టమవుతున్నది.
నారాయణఖేడ్, ఆగస్టు 16: కాంగ్రెస్ కార్యకర్తలు బయటకు గంభీరంగానే కనిపిస్తున్నా, లోలోపల మాత్రం అంతర్మధనం చెందుతున్నారు. నలుగురు కలిసిన చోట తమ పరిస్థితిపై తమకు తామే విశ్లేషించుకుంటూ ‘ప్రభుత్వమొస్తే మాకేమొచ్చింది’ అనే ధోరణిలో కార్యకర్తలు మదనపడుతున్నారు. గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనులు నిరాటంకంగా కొనసాగిన క్రమంలో ముఖ్య నాయకులు, కార్యకర్తలు భాగస్వాములు కావడం ద్వారా వ్యక్తిగత ప్రతిష్టతో పాటు ఎంతో కొంత లబ్ధి జరిగే అవకాశం ఉండేది. ప్రస్తుతం పెద్దగా అభివృద్ధి పనులేవి కొనసాగకపోవడం కార్యకర్తలకు శాపంగా మారింది. పదవుల విషయానికి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేండ్లలో సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు మాత్రమే జరిగాయి. నామినేటెడ్ పదవుల మాటే లేకుండా పోయింది.
సంగారెడ్డి జిల్లాలోనే నారాయణఖేడ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీది ప్రత్యేక పరిస్థితి. స్థానిక కాంగ్రెస్ పార్టీలో 1994లో పుట్టిన గ్రూపుల కుంపటి ఇప్పటికీ రాజుకుంటూనే ఉన్నది. గత అసెంబ్లీ ఎన్నికల్లో వర్గ విభేదాలకు చెక్ పెట్టే దిశగా ఎంపీ సురేష్ శెట్కార్ తనకు వచ్చిన పార్టీ టికెట్ను ప్రస్తుత ఎమ్మెల్యే సంజీవ్రెడ్డికి ఇచ్చారు. అంతేకాకుండా ఎన్నికల్లో కలిసి పని చేయడంతో కాంగ్రెస్ గెలుపొందిందింది. ఎంపీ ఎన్నికల్లోనూ ఇదే ఒరవడిని కొనసాగించడంతో ఎంపీగా సురేష్ శెట్కా ర్ ఎన్నికయ్యారు. ఇంతవరకు బాగానే ఉన్నా, అటు తర్వాత చోటు చేసుకున్న పలు పరిణామాలు ఇంకా గ్రూపుల గొడవలు సమసిపోలేదనే సంకేతాలు ఇస్తున్నాయి.
డీసీసీ అధ్యక్ష పదవి కోసం ఇరు వర్గాల నేతలు పోటీ పడడం, ఇదే సందర్భంలో వాగ్వాదం జరగడం, నారాయణఖేడ్ ఏరియా దవాఖాన గేటు విషయంలోనూ ఎంపీ, ఎమ్మెల్యే వర్గీయుల తీరు గ్రూపు విభేదాలను బయటపెట్టాయి. ఇంకా బయటకు పొక్కని ఎన్నో అంశాలు ఎంపీ, ఎమ్మెల్యే మధ్య సఖ్యత కుదరలేదనే విషయాన్ని సొంత పార్టీ కార్యకర్తలే మాట్లాడుకోవడం విశేషం. ఈ పరిణామాల మధ్య గతంలో ఉన్న పరిస్థితే ఇప్పుడు కార్యకర్తలకు ఎదురవుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఒక వర్గం కార్యకర్తలుగా ముద్రపడిన వారికి మరో వర్గం నాయకులు సహకరించడం లేదనే వాదనలు ఉన్నాయి. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల వేళ అందరూ కలిసి నేతల గెలుపునకు కృషి చేస్తే, తాము లాభపడే సమయానికి గ్రూపులు ఇబ్బందికరంగా మారాయని పలువురు కాంగ్రె స్ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అసలే పదవులు రాక, పనులు లేక కొట్టుమిట్టాడుతున్న తమకు, ఇంటిపోరు కొత్త చిక్కులను తెచ్చిపెడుతుందని కార్యకర్తలు వాపోతున్నారు. తమ నాయకుడు టికెట్ త్యాగం చేస్తే ఎమ్మెల్యేగా ఎన్నికై తమనే దూరం పెడుతున్నారని ఎంపీ వర్గీయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న నాయకుడు తన సొంత క్యాడర్కే తొలి ప్రాధాన్యత ఇవ్వడం రాజకీయాల్లో సహజమేనని ఎమ్మెల్యే వర్గీయులు వాదిస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే నారాయణఖేడ్ నియోజకవర్గంలో పట్టు సాధించేందుకు ఎవరికివారు పోటీపడుతున్నట్లు కనిపిస్తున్నప్పటికీ, ఎవరి క్యాడర్ను వారు పదిల పర్చుకునే ప్రయత్నం కూడా స్పష్టమవుతున్నది.
అధికారంలో ఉన్నా పదవులకు నోచుకోని పరిస్థితుల్లో కాంగ్రెస్ కార్యకర్తలు సతమతమవుతున్నారు. పదవులకు గ్రహణం పట్టుకున్నట్టు ఆశావహులకు నామినేటెడ్ పదవులు సైతం దక్కడం లేదు. ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేండ్లు గడిచిపోయినా, ఇప్పటి వరకు నారాయణఖేడ్ మార్కెట్ కమిటీ ఎన్నిక ప్రశ్నార్థకంగా మారింది. అదే స్థాయి పదవి ఆత్మ కమిటీని సుమారు రెండు నెలల క్రితమే పూర్తి చేసినట్లు చెబుతున్నప్పటికీ, ఇప్పటి వరకు అధికారికంగా బాధ్యతలు చేపట్టకపోవడం గమనార్హం.
నియోజకవర్గానికి చెందిన రెండు కీలక పదవుల నియామకంలో జాప్యం జరిగేందుకు పార్టీలో జరుగుతున్న వర్గ విభేదాలే కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ రెండు కమిటీలను ఏర్పాటు చేసిన పక్షంలో చైర్మన్, వైస్ చైర్మన్ సహా డైరెక్టర్ల రూపంలో కొంత మందికి పదవులు దక్కే అవకాశం ఉంది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు పూర్తయిన పక్షంలో, ఆ రకంగా కూడా కొంత మేర ఆశావహులను సంతృప్తి పరిచే ఆస్కారం ఉండేది. ఆ ఎన్నికలు ఇప్పట్లో జరిగే పరిస్థితి కనిపించడం లేదు. ఇక పీఏసీఎస్ ఎన్నికల పరంగా కొంత మందికి అవకాశం కల్పిద్దామనుకున్నా, కోర్టు ఆదేశాలతో పాత పాలకవర్గాలే మరో పర్యాయం కొనసాగుతున్న అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఒక్క సీడీసీ చైర్మన్ పదవి మినహా ఏ పదవులు కాంగ్రెస్ కార్యకర్తలను వరించకపోవడం వారిని నైరాశ్యంలోకి నెడుతున్నది. తమ స్థానాలను వెతుక్కునే పనిలో ఉన్న కార్యకర్తలకు గ్రామాల్లో ఉన్న ఇబ్బందులేమి తక్కువ కాదు. తమ నాయకుల గెలు పే లక్ష్యంగా గ్రామాల్లో ఆరు గ్యారెంటీలతో పాటు స్థానిక సమస్యల పరిష్కారాలను ఎరగా వేసి ప్రజలను ఒప్పించి, మెప్పించి కాంగ్రెస్కు ఓట్లు వేయించారు.
అప్పుడు చెప్పినవేవి అమలుకు నోచుకోక గ్రామాల్లో కాంగ్రెస్ కార్యకర్తల పరిస్థితి కొంత ఇబ్బందికరంగా తయారైందనే చెప్పాలి. ఏదిఏమైనా పదేండ్లు అధికారానికి దూరంగా ఉన్న తమ నియోజకవర్గ స్థాయి నాయకులకు పదవులు వచ్చాయని సంతృప్తి చెంది సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి కాంగ్రెస్ కార్యకర్తలకు రావడం కొసమెరుపు.