పాలకుర్తి రూరల్, జూన్ 05: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన పల్లె ప్రగతితోనే గ్రామాలకు మహర్దశ లభించిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఐదో విడుత పల్లెప్రగతిలో భాగంగా ఆదివారం ఉదయం ఎర్రబెల్లి దయాకర్రావు స్వయంగా పాలకుర్తిలో దళిత, బీసీ కాలనీల్లో పారిశుధ్య పనులు చేపట్టారు. తానే స్వయంగా డ్రైనేజీల్లో చెత్తను తొలగించి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి పార చేతపట్టి చెత్తను తొలగించారు. పారిశుధ్యంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఆనంతరం ఎర్రబెల్లి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదన్నారు. రాష్ర్టానికి రావాల్సిన రూ.1400 కోట్ల నిధులను కేంద్రం విడుదల చేయడం లేదని మండిపడ్డారు. రాష్ట్రం ఇవ్వాల్సిన రూ.165 కోట్లను గ్రామ పంచాయతీలకు విడుదల చేశామన్నారు.
ఈజీఎస్ నిధుల కోసం త్వరలోనే మా శాఖ కార్యదర్శి ఢిల్లీకి వెళతున్నారని తెలిపారు. కేంద్రం రాష్ర్టానికి అవార్డులు ఇస్తుంది తప్ప నిధులు ఇవ్వడం లేదని ధ్వజమెత్తారు. దేశంలో 20 ఉత్తమ గ్రామ పంచాయతీలకు 19 గ్రామ పంచాయతీలు తెలంగాణ నుంచే ఎంపిక చేశారన్నారు. పల్లెప్రగతిలో సర్పంచ్ల పాత్ర కీలకమన్నారు. పార్టీలకతీతంగా సర్పంచ్లు పల్లెప్రగతిని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పాలకుర్తిలో పరిశుభ్రత లోపించిందని, దీనిని సరిచేయాలని కోరారు. స ర్పంచ్లు నిధులు రావడం లేదని చెప్పడం సరైంది కాదన్నారు. ప్రతి గ్రామ పంచాయతీకి నిధులను విడుదల చేశామన్నారు. ఈ సమావేశంలో ఎంపీపీ నల్లా నాగిరెడ్డి, జడ్పీటీసీ పుస్కూరి శ్రీనివాస్రావు, సర్పంచ్ వీరమనేని యాకాంతారావు, పాలకుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముస్కు రాంబాబు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు ఎండీ మదార్, మారం శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి వెంకటాచారి, పట్టణ అధ్యక్షుడు కడుదుల కరుణాకర్రెడ్డి, వర్రె వెంకన్న పాల్గొన్నారు.
మంత్రి ఎర్రబెల్లికి చద్దన్నం తినిపించిన దళిత మహిళలు
పల్లెప్రగతి కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుకు దళితులు ఆప్యాయతను పంచారు. పాలకుర్తిలో నిర్వహించిన పల్లెప్రగతి కార్యక్రమంలో పాల్గొని మహబూబాబాద్ జిల్లా తొర్రూరుకు వెళ్తున్న ఎర్రబెల్లి కొడకండ్ల మండలం రేగులలో రోడ్డుపై ఉన్న కూలీలను చూసి కొద్దిసేపు ఆగారు. ఈ సందర్భంగా దళిత మహిళలు మంత్రి ఎర్రబెల్లి వద్దకొచ్చి ‘అయ్యా.. మా బువ్వ నువ్వు తింటావా..’ అని అన్నం కలిపి మంత్రికి తినిపించారు. అనంతరం మంత్రి ఎర్రబెల్లి సైతం వారికి అన్నం తినిపించి వారిపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. వారితో ఎర్రబెల్లి కాసేపు ముచ్చటించి సమస్యలు తెలుసుకున్నారు. మమ్ములను కంటికి రెప్పలా కాపాడుకుంటున్న దయన్న మా బువ్వ తిన్నడారని చెబుతూ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.