నర్సింహులపేట, మే 23: రైతన్నల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నది. ఇప్పటికే రైతుబంధు పథకంతో ఎకరానికి రూ. 10 వేలు ఇస్తున్నది. కాగా, అన్నదాతలు అధిక దిగుబడి కోసం రసాయన ఎరువులు ఇబ్బడిముబ్బడిగా వాడడంతో భూసారం దెబ్బతింటున్నదని, పర్యావరణ సమస్యలు తలెత్తుతాయని వ్యవసాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని నివారణకు పచ్చిరొట్ట సాగు చేసుకోవాలని ప్రోత్సహిస్తున్నారు. దీంతో 50శాతం ఎరువుల ఖర్చు తగ్గడంతో పాటు బహుళ ప్రయోజనాలు ఉంటాయని పేర్కొంటున్నారు. ఈ క్రమంలో భూసారాన్ని పెంచి, అధిక దిగుబడితోపాటు నాణ్యమైన పంట ఉత్పత్తులను సాధించేందుకు ప్రభుత్వం 65శాతం సబ్సిడీపై జీలుగ విత్తనాలు అందిస్తుంది. రైతులు సాగుకు ఆసక్తి చూపుతున్నారు.
నర్సింహులపేట, మే 23 : రైతుల సంక్షేమానికి రాష్ట్ర సర్కారు అనేక పథకాలు అమలు చేస్తున్నది. పంట పెట్టుబడి, 24 గంటల కరంటు, సాగునీరు అందిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనకపోయిన అన్నదాతలకు ఇబ్బందులు లేకుండా మద్దతు ధరకు తెలంగాణ ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నది. దీనికి తోడు భూసారాన్ని పెంచి నాణ్యమైన పంట ఉత్పత్తులను సాధించేందుకు 65 శాతం సబ్సిడీపై జీలుగ విత్తనాలు అందిస్తుంది.
‘పచ్చిరొట్ట’తో బహుళ ప్రయోజనాలు
రైతులు ఇబ్బడిముబ్బడిగా రసాయన ఎరువులు వాడడంతో దిగుబడి తగ్గి, భవిష్యత్లో భూసారం దెబ్బతింటుందని, పర్యావరణ సమస్యలు తలెత్తుతాయని వ్యవసాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. పచ్చిరొట్ట ఎరువులతో ఈ సమస్యలకు చక్కటి పరిష్కారం అభిస్తుందని, బహుళ ప్రయోజనాలు ఉంటాయని తెలుపుతున్నారు.
40 రోజుల ముందు సాగు..
పొలం, చెలకలో పంట వేసే 35 నుంచి 40 రోజుల ముందు జీలుగ, జనుము పంటను తొలకరి వర్షాలు కురవగానే భూమిలో వేసుకోవాలి. ఏపుగా పెరగగానే వరి పడిలోనే నీరు పోసి కలియదున్నాలి. చెలకలో అయిలతే రోటవేటర్తో దున్నితే భూమిలో కలిసి పోతుంది. పచ్చిరొట్ట వాడడం వల్ల భూసారం పెరిగి మంచి దిగుబడులు రావడానికి అస్కారం ఉంటుంది. మొక్కలకు 2 శాతం నైట్రోజన్, సూపర్ ఫాస్పేట్ను అదనంగా అందిస్తుంది. జీలుగ లెగ్యూజాతీకి చెందిన మొక్క కావడంతో వేర్లలో నత్రజని స్థీరకరణ అధికంగా ఉంటుంది. జింక్, మాగనీస్, ఇనుము వంటి సూక్ష్మ పోషకాలు పంటకు అందుతాయి. నీటినిల్వ సామర్థ్యాన్ని పెచుతుంది. నేలలో కరిగే మూలకాలను పంటకు అనుకూలంగా మారుస్తాయి. వానపాముల ఉత్పత్తికి దోహదం చేస్తుంది. కలుపు మొక్కలను అడ్డుకుంటుంది. భూసారం పెరగడంతో రసాయనిక ఎరువుల వాడకం 50 శాతతం తగ్గిపోతుంది. సహజసిద్ధంగా భూసారం పెరిగి నాణ్యమైన ఉత్పత్తులను సాధించే అవకాశం ఉంటుందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. దీంతో ప్రభుత్వం రాయితీపై పచ్చిరొట్ట విత్తనాలు అందజేస్తున్నది..
పచ్చిరొట్టతో అధిక దిగుబడి
జీలుగ, జనుము సాగుతో రైతులు సహజ సిద్ధంగా భూసారాన్ని పెంచుకుని లబ్ధి పొందాలి. 25 నుంచి 30శాతం మంది రైతులు పచ్చిరొట్ట సాగు చేస్తున్నారు. సాధ్యమైనంత ఎక్కువ మంది రైతులు పచ్చిరొట్ట ఎరువులు సాగు చేయాలి. ప్రభుత్వం రాయితీపై విత్తనాలు అందజేస్తున్నది. 65శాతం సబ్సిడీపై 30 కిలోల జీలుగ విత్తనాలు అందిస్తున్నది. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. పచ్చిరొట్టతో రైతులకు 50శాతం ఎరువుల ఖర్చు తగ్గుతుంది. ఆరోగ్యకర ఉత్పత్తులను పొందవచ్చు. -రామకృష్ణ, ఏవో ఇన్చార్జి