మహబూబాబాద్, మే 16 : ప్రజావాణిలో వచ్చిన వినతులను సంబంధిత అధికారులు పరిశీలించి సత్వ రం పరిష్కారం చూపాలని, పెండింగ్లో పెట్టొద్దని కలెక్టర్ శశాంక అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన అదనపు కలెక్టర్ డేవిడ్తో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలు ఒకే సమస్యపై పలుసార్లు కలెక్టరేట్కు రాకుండా సత్వర పరిష్కారం చూపి, వెంటనే ఆన్లైన్ లో నమోదు చేయాలన్నారు. సమస్య పరిష్కారం కానిపక్షంలో ఏ దశలో ఉందో అర్జీదారుడికి సమాచారం ఇవ్వాలన్నారు. జిల్లా అధికారులు తమ కార్యాలయాల్లోని పోస్టుల వివరాలతో కూడిన రోస్టర్ రిజిస్టర్ అప్డేట్ చేసి, మూడు రోజుల్లోగా అందజేయాలన్నారు. భూ సంబంధిత సమస్యల పరిష్కారానికి ధరణిలో ఆప్షన్ ఇచ్చినట్లు తెలిపారు. గ్రీవెన్స్కు మొత్తం 55 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. కేసముద్రం, గూడూరు మండలాలకు సంబంధించిన సమస్యలపై అక్కడి అధికారులు దృష్టిసారించి పరిష్కారం చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో సన్యాసయ్య, జడ్పీ సీఈవో రమాదేవి, డీపీవో సాయిబాబా, డీహెచ్ఎస్ సూర్యనారాయణ, డీడబ్ల్యూవో స్వర్ణలతలెనినా, ఎస్పీ కార్పొరేషన్ ఈడీ బాలరాజు, డీఈవో అబ్దుల్హై, మత్స్యశాఖ అధికారి నాగమణి పాల్గొన్నారు.
పట్టుదలతో చదివితే విజయం మీదే..
పట్టుదల, ప్రణాళిక, క్రమశిక్షణతో చదివితే పోటీ పరీక్షల్లో విజయం మీదేనని, సమయం వృథా చేయొద్దని కలెక్టర్ శశాంక ఉద్యోగార్థులకు సూచించారు. సోమవారం ఆయన ఎస్పీ శరత్చంద్రపవార్, ఏఎస్పీ యోగేశ్గౌతమ్తో కలిసి జిల్లా కేంద్రంలో ఎస్సీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టడీ సర్కిల్, అంతకుముందు డిగ్రీ కళాశాలను, కోర్టు రోడ్డులోని సాయిదత్త నర్సింగ్ జూనియర్ శిక్షణా శిబిరాలను సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఉద్యోగార్థులు ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కష్టపడి చదివి కొలువు కొట్టాలన్నారు. జిల్లాలో 1172 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. స్వరాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుతో కు టుంబం దగ్గరే ఉద్యోగాలు చేసుకునే అవకాశం వచ్చిందన్నారు. ఎస్పీ శరత్చంద్రపవార్ మాట్లాడుతూ… ఉద్యోగం సాధించాలంటే మొదట అభ్యర్థులు ఫిట్గా ఉండాలన్నారు. అవసరమైన ఫ్యాకల్టీని తీసుకొచ్చేందుకు తమవంతు సహకారం ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఎస్సీడీవో సన్యాసయ్య పాల్గొన్నారు.