నెల్లికుదురు, మార్చి 2 : పరిశుభ్రత, పచ్చదనం, పారిశుధ్యంపై అవగాహన కల్పించడం, పరిసరాలపై బాధ్యత పెంచేందుకు ప్రభుత్వం స్వచ్ఛ విద్యాలయం పురస్కారం పేరిట అవార్డులు అందిస్తున్నది. ఈమేరకు అంశాలవారీగా వివరాలు సేకరిస్తోంది. పచ్చదనం, తాగునీటి వసతి, పారిశుధ్యం, విద్యార్థులు పరిశుభ్రత మెరుగుపర్చే విధంగా చర్యలు తీసుకుంటున్న పాఠశాలలకు గుర్తింపు ఇవ్వాలనే సదుద్దేశంతో ప్రతీ ఏటా ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తున్నది. 2017 నుంచి ఈ అవార్డులను అందిస్తున్నప్పటికీ కరోనా నేపథ్యంలో అవార్డుల జారీలో జాప్యమైంది. ప్రస్తుతం కరోనా తీవ్రవ తగ్గుముఖం పట్టడంతో ఈ ఏడాది నుంచి స్వచ్ఛ విద్యాలయ పురస్కారాలు అందించనున్నారు. దరఖాస్తు చేసుకోవడానికి విద్యా శాఖ గత నెల 10న నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 31వరకు యాప్లో ఆన్లైన్ ద్వారా పాఠశాలలు దరఖాస్తు చేసుకోవాలి. ఏప్రిల్ నెలలో జాతీయస్థాయిలో ఎంపికైన పాఠశాలలను ప్రకటిస్తారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 1,915 పాఠశాలల రిజిస్ట్రేషన్ పూర్తయ్యింది.
యాప్లో రిజిస్ట్రేషన్, వివరాల నమోదు ఇలా..
స్వచ్ఛ విద్యాలయ పురస్కారం పోటీల్లో పాల్గొనేందుకు మొబైల్లో ప్టేసోర్ నుంచి స్వచ్ఛ విద్యాలయం పురస్కార్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. అనంతరం యాప్లోకి వెళ్లి పాఠశాల యూడైస్ కోడ్ నమోదు చేసి పాఠశాల రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అనంతరం పాఠశాల వివరాలు యాప్లో నమోదు చేయాలి.
కమిటీ ఆధ్వర్యంలో ఎంపిక
స్వచ్ఛ విద్యాలయ పురస్కారం కోసం పాఠశాలల నుంచి వచ్చిన దరఖాస్తులు, సర్వే వివరాలు పరిశీలించి ఎంపిక చేస్తారు. కలెక్టర్ అధ్యక్షతన ఈ కమిటీలో జిల్లా విద్యాశాఖ అధికారి, ముగ్గురు ఉపాధ్యాయులు, వాటర్ సైప్లె అధికారి, వైద్యాధికారి, ఇద్దరు ఎన్జీవోలు సభ్యులుగా ఉంటారు. పురస్కారం నిబంధనల ప్రకారం జిల్లా నుంచి 38 పాఠశాలలను ఎంపిక చేసి రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తారు. కలెక్టర్ సమక్షంలో జిల్లా కమిటీ ఏప్రిల్ 1, 2 తేదీల్లో 50శాతం పైబడి మార్కులు సాధించిన పాఠశాలలను రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తారు. ఏప్రిల్ మొదటి వారంలో జాతీయస్థాయిలో ఎంపికైన పాఠశాలల జాబితాను ప్రకటించి రూ.60వేల నగదు, ప్రశంసా పత్రాలను అందించనున్నారు.
ఉమ్మడి జిల్లాలో 1,915 స్కూళ్ల రిజిస్ట్రేషన్
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 4,377 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 1,915 స్కూళ్ల రిజిస్ట్రేషన్ పూర్తికాగా 574 పాఠశాలలు ఫైనల్ సబ్మిషన్ చేశాయి. జిల్లాలవారీగా మహబూబాబాద్ జిల్లాలో 1,238 పాఠశాలలకు 620 పాఠశాలలు రిజిస్ట్రేషన్ చేసుకోగా 330 పాఠశాలలు ఫైనల్ సబ్మిషన్ చేశాయి. హనుమకొండ జిల్లాలో 947 పాఠశాలలకు 484 పాఠశాలలు రిజిస్ట్రేషన్ చేసుకోగా 96 పాఠశాలలు ఫైనల్ సబ్మిషన్ చేశాయి. ములుగు జిల్లాలో 571 పాఠశాలలకు 344 పాఠశాలలు రిజిస్ట్రేషన్ చేసుకోగా 95 పాఠశాలలు ఫైనల్ సబ్మిషన్ చేశాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 552 పాఠశాలలకు 301 పాఠశాలలు రిజిస్ట్రేషన్ చేసుకోగా 28 పాఠశాలలు ఫైనల్ సబ్మిషన్ చేశాయి. వరంగల్ జిల్లాలో 1,069 పాఠశాలలకు 166 పాఠశాలలు రిజిస్ట్రేషన్ చేసుకోగా 25 పాఠశాలలు ఫైనల్ సబ్మిషన్ చేశాయి.
ఆరు అంశాలకు ప్రాధాన్యత
స్వచ్ఛ విద్యాలయ పురస్కారం పోటీల్లో ప్రత్యేకించి పాఠశాలల్లోని ఆరు అంశాలకు ప్రాధాన్యం ఇస్తారు. నీరు, మరుగుదొడ్ల నిర్వహణ, చేతుల పరిశుభ్రత, విద్యార్థుల ప్రవర్తనలో మార్పు, కొవిడ్ నిబంధనకు ప్రత్యేక ప్రాధాన్యమిచ్చి వాటికనుగుణంగా మార్కులు వేస్తారు. మొత్తం 110 మార్కులు ఉంటాయి. ఎక్కువ స్కోరు చేసిన 38 విద్యాలయాలకు జిల్లాస్థాయి అవార్డులు అందిస్తారు. జిల్లాస్థాయి అవార్డు పొందిన వాటిని రాష్ట్రస్థాయి, జాతీయస్థాయికి ఎంపికి చేస్తారు. జాతీయస్థాయిలో ఎంపికైన పాఠశాలలకు రూ.60 వేల నగదు, ప్రశంసా పత్రం అందిస్తారు.
ఇలా ఎంపిక చేస్తారు..
పాఠశాలలో విద్యార్థులకు శుద్ధమైన తాగునీటి వసతి కల్పించడం.
పాఠశాలలో పారిశుధ్యం, టాయిలెట్స్లో నీటి వసతి, మధ్యాహ్న భోజన సమయంలో పరిశుభ్రత పాటించేలా చూడడం.
సబ్బుతో విద్యార్థులు చేతులు శుభ్రం చేసుకునేలా చూడడం. పాఠశాలల్లో విద్యార్థులు మధ్యా హ్న భోజనానికి ముందు, టాయిలెట్కు వెళ్లి వచ్చిన తర్వాత సబ్బుతో చేతులు శుభ్రం చేసుకునేలా చూడడం.
పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి. ఆవరణలో తడి, పొడిచెత్త, ఇతర వ్యర్థాలను వేరుచేయడం వంటి అంశాల నిర్వహణకు ప్రాధాన్యమివ్వాలి.
ఉపాధ్యాయులు పరిశుభ్రతపై విద్యార్థుల్లో అవగాహన కల్పించడం ద్వారా సరైన పద్ధతులు పాటిస్తూ విద్యార్థుల ప్రవర్తనలో మా ర్పులను గుర్తించడం.
కొవిడ్-19 కారణంగా బోధన కుంటుపడడంతో విద్యార్థులను మొదట సంసిద్ధులను చేసి వారి ప్రతిస్పందనను గుర్తించాలి. పాఠశాలలో కొవిడ్ నిబంధనలను పాటిస్తూ బోధించాలి.
ప్రతి పాఠశాల రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
స్వచ్ఛ విద్యాలయం పురస్కారం అవార్డు 2021-22 కోసం జిల్లాలోని ప్రతి పాఠశాల రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీ పాఠశాలలోని ఆరు అంశాలకు సంబంధించిన వివరాలను యాప్లో నమోదు చేసుకోవాలి. ఎంఈవోలు తమ పరిధిలోని అన్ని పాఠశాలలు రిజిస్ట్రేషన్ చేసుకునేలా చూడాలి. జాతీయస్థాయికి ఎంపికైన పాఠశాలకు రూ.60వేల నగదు, ప్రశంసా పత్రం అందిస్తారు.
– అబ్దుల్ హై, జిల్లా విద్యాశాఖ అధికారి, మహబూబాబాద్
50శాతం దాటితే అవార్డుకు ఎంపిక
స్వచ్ఛ విద్యాలయం పురస్కారం కోసం యాప్ ద్వారా వివరాలు నమోదు చేసుకోవాలి. అంశాలవారీగా ప్రశ్నలు, మార్కులు ఉంటాయి. నీటి అంశాలనికి 9 ప్రశ్నలకుగాను 22 మార్కులుంటాయి. టాయిలెట్స్ నిర్వహణకు 12 ప్రశ్నలు 27 మార్కులు, చేతుల శుభ్రతకు 6 ప్రశ్నలు 14 మార్కులు, యాజమాన్య పద్ధతులకు గాను 13 ప్రశ్నలు 21 మార్కులు, విద్యార్థుల ప్రవర్తనలో మార్పులపై 7 ప్రశ్నలు 11 మార్కులు, కొవిడ్ నిబంధనలపై 12 ప్రశ్నలు 15 మార్కులు ఇలా మొత్తం 59 ప్రశ్నలు 110 మార్కులు ఉంటాయి. ఇందులో 50శాతానికి పైగా మార్కులు సాధించిన పాఠశాలలను పరిగణలోకి తీసుకుని అవార్డుకు ఎంపిక చేస్తారు.
– ముఖేశ్, స్వచ్ఛ విద్యాలయం జిల్లా నోడల్ అధికారి