మహబూబాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో టీఆర్ఎస్ సర్కారు పుణ్యమా అని గ్రంథాలయాలకు మహర్దశ పట్టింది. ఉమ్మడి రాష్ట్రంలో పెంకుటిళ్లు, పాత భవంతులు, రేకుల గదుల్లో కొనసాగిన వీటికి స్వరాష్ట్రంలో మంచి రోజులు వచ్చాయి. గతంలో డివిజన్ కేంద్రంగా ఉన్న మహబూబాబాద్, 2016 అక్టోబరు 11న జిల్లాగా ఏర్పాటు కాగా ఇక్కడ అత్యాధునిక లైబ్రరీ ఉండాలని ప్రణాళికలు తయారు చేశారు. శ్రీనివాస టాకీస్ వెనుక ఉన్న పాత భవనాన్ని కూల్చేసి, దాని స్థానంలో రూ.2.80కోట్లతో జీ ప్లస్ 2 భవనాన్ని అత్యద్భుతంగా నిర్మించారు. సిరిసిల్ల తరహా కట్టిన ఈ గ్రంథాలయం ప్రారంభానికి సిద్ధమైంది.
కార్పొరేట్ స్థాయిలో..
కొత్త గ్రంథాలయ భవనాన్ని కార్పొరేట్ స్థాయిలో నిర్మించారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఐదు షెట్టర్లు నిర్మించి, పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. వాచ్మన్కు వసతి గదిని నిర్మించారు. మొదటి అంతస్తులో గ్రంథాలయ కార్యాలయం, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్రావు గది, కార్యదర్శి గదులు ఉన్నాయి. ఇందులోనే తాగునీటి వసతి ఉంది. మహిళలు, పురుషులకు వేర్వేరుగా టాయ్లెట్లు నిర్మించారు. రీడింగ్ రూముతో పాటు, వరండాలో అన్ని రకాల తెలుగు, హిందీ, ఇంగ్లిష్, ఉర్దూ పత్రికలను అందుబాటులో ఉంచుతున్నారు. పోటీ పరీక్షల కోసం సిద్ధమయ్యే వారి కోసం ప్రత్యేక గదితోపాటు ప్రొజెక్టర్ కూడా ఏర్పాటు చేశారు. రెండో అంతస్తులో స్టోర్ రూమ్తోపాటు పుస్తకాల ర్యాక్లు ఏర్పాటు చేశారు. గ్రంథాలయంలో పుస్తకాల నిల్వ కోసం ప్రత్యేకంగా 10 కంప్యూటర్లతో కూడిన గదిని నిర్మించారు. ఇప్పటివరకు 22వేల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ఇంకా పాఠకులు కోరిన పుస్తకాలను అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
రూ.2.80కోట్లతో..
రూ.2.80కోట్లతో గ్రంథాలయ కొత్త భవనాన్ని నిర్మించారు. మంత్రి కేటీఆర్ సహకారంతో సింగరేణి నుంచి రూ.1.60కోట్లు, మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత సీడీఎఫ్ ఫండ్ నుంచి రూ.50లక్షలు, గతంలో పనిచేసిన కలెక్టర్ ప్రీతీమీనా కేటాయించిన రూ.30లక్షలు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి రూ.20లక్షలు, ప్రస్తుత కలెక్టర్ శశాంక కేటాయించిన రూ.20లక్షల నిధులతో అన్ని వసతులతో గ్రంథాలయాన్ని సిద్ధం చేశారు.
మంత్రి కేటీఆర్ చొరవతోనే..
రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చొరవతో మానుకోట జిల్లా గ్రంథాలయ కొత్త భవనాన్ని అన్ని హంగులతో నిర్మించాం. పుస్తకాలు, ర్యాక్లు, కంప్యూటర్లు, కుర్చీలు, బల్లలు సిద్ధం చేశాం. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలకు సిద్ధమయ్యేందుకు కావాల్సిన పుస్తకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు, యువతకు ఎంతగానో ఉపయోగపడేలా ఈ గ్రంథాలయాన్ని తీర్చిదిద్దాం.
– గుడిపూడి నవీన్రావు, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్