ఓరుగల్లులో ప్రగతి పరవళ్లు
స్వరాష్ట్రంలోనే సరికొత్త హంగులు
వరంగల్, నమస్తే తెలంగాణ : చారిత్రక ఓరుగల్లు నగరంలో ప్రగతి పరవళ్లు తొక్కుతున్నది. హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరమైన వరంగల్, స్వరాష్ట్రంలోనే సరికొత్త హంగులను సమకూర్చుకున్నది. ఆరున్నరేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ఎన్నో అభివృద్ధి పనులతో ‘గ్రేటర్’ రూపురేఖలే మారిపోయాయి.
ఆరున్నరేళ్ల సమయంలోనే టీఆర్ఎస్ సర్కారు చారిత్రక ఓరుగల్లు నగరాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ నగర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిపెట్టి నిధుల వరద పారిస్తున్నారు. ఓరుగుల్లును హైదరాబాద్ స్థాయిలో తీర్చిదిద్దాలన్న సంకల్పంతో మూడేళ్ల కాలంలో బడ్జెట్లో ప్రత్యేకంగా రూ.900కోట్లు కేటాయించి నగరాభివృద్ధికి బాటలు వేశారు. 2021-22 బడ్జెట్లోనూ ప్రత్యేకంగా రూ.250 కోట్లు కేటాయించి సామాన్యుల జీవన ప్రమాణాలు పెంచాలన్న లక్ష్యంతో కనీస వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు కేటాయిస్తూనే కేంద్ర పథకాలను నగరానికి తేవడంలో సఫలీకృతులయ్యారు. స్మార్ట్సిటీ, హృదయ్, అమృత్ పథకాలను నగరానికి దక్కించుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేసింది. రూ.వందల కోట్ల నిధులతో నగర రూపురేఖలు మారుతున్నాయి.
పర్యాటక శోభ
కాకతీయుల వారసత్వ నగరం పర్యాటక ప్రాంతంగా మరింత అభివృద్ధి చెందుతున్నది. గత పాలకులు ఓరుగల్లు అభివృద్ధిని విస్మరించారు. స్వరాష్ట్రం సాకారమై టీఆర్ఎస్ సర్కారు కొలువుదీరిన తర్వాత వరంగల్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారించింది. హృదయ్ పథకాన్ని నగరానికి తేవడంలో తెలంగాణ ఎంపీలు చేసిన కృషి ఫలాలు ఇప్పుడు నగరంలో కనిపిస్తున్నాయి. బయోడైవర్సిటీ కల్చరల్ పార్క్ ఇటీవలే మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభమైంది. తెలంగాణ ప్రాంతంలోనే భద్రకాళీ బయోడైవర్సిటీ కల్చరల్ పార్కు మోడల్గా నిలువబోతున్నది. కాకతీయుల వారసత్వ సంపద దశాబ్దాలుగా నిరాదరణకు గురైంది. రాష్ట్ర సర్కారు దాన్ని వెలుగులోకి తెచ్చేందుకు నడుంబిగించింది. ఖిలా వరంగల్కోటలోని కాకతీయుల కళాసంపదకు కొత్త అందాలు తీసుకొస్తున్నది. వేయి స్తంభాల ఆలయం, పద్మాక్షి ఆలయం, ఖాజీపేట దర్గా, జైన్ గుట్టలు రాష్ట్ర ప్రభుత్వ చొరవతోనే అభివృద్ధికి నోచుకున్నాయి. నగరంలోని చారిత్రక పాంత్రాల అభివృద్ధిపై సర్కారు గత ఆరేళ్లుగా దృషిపెట్టడంతో దేశ, విదేశీ పర్యాటకులు రావడం పెరిగింది. దీంతో ఓరుగల్లు కీర్తి ప్రపంచ నలుదిశలా వ్యాప్తించింది.