అదనపు కలెక్టర్ బీ హరిసింగ్
కొనుగోలు కేంద్రాల తనిఖీ
రాయపర్తి, జూన్ 6 : మండలంలో ఐకేపీ, పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని గోదాములు, మిల్లులకు వేగంగా తరలించాలని అదనపు కలెక్టర్ బీ హరిసింగ్ సంబంధిత అధికారులను కోరారు. ఆదివారం మండలంలోని కొండాపురం, పెర్కవేడు, రాయపర్తి గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన సందర్శించారు. ధాన్యం కొనుగోలు, తరలింపు వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. హరిసింగ్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన సంచుల వివరాలు, ధాన్యపు రాసుల అంచనా, గన్నీ సంచుల లభ్యత, రైతులు సహకరిస్తున్న విధానాలను అడిగి తెలుసుకున్నారు. హరిసింగ్ మాట్లాడుతూ నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించే అవకాశముందన్నారు. వర్షాలు కురిసే అవకాశమున్నందున తూకం వేసిన ధాన్యాన్ని వెంటనే రైస్మిల్లులు, గోదాములకు తరలించాల్సిందిగా ఆయన ఆదేశించారు. వర్షాలు కురిస్తే ధాన్యం నీటిపాలవుతుందని, అందువల్ల కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవన్నారు.
పెర్కవేడులో రైస్మిల్లు సందర్శన
మండలంలోని పెర్కవేడు గ్రామంలోని శ్రీ అన్నపూర్ణ రైస్ మిల్లును అదనపు కలెక్టర్ హరిసింగ్ సందర్శించారు. ఈ సందర్బంగా ప్రభుత్వం నిర్ధేశించిన మేరకు ధాన్యపు కోటాను దిగుమతి చేసుకోవాల్సిందిగా మిల్లు యాజమన్యానికి సూచించారు. నిబంధనల పేరుతో రైతులను ఇబ్బందులకు గురి చేసేందుకు ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. ఆయన వెంట జిల్లా పౌర సరఫరాల శాఖాధికారి భాస్కర్రావు, దయాకర్, గట్టయ్య, ఐకేపీ సీసీ దేవేంద్ర తదితరులు ఉన్నారు.