విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వం ఏటా ‘ఇన్స్పైర్ మనక్’ నిర్వహిస్తున్నది. విద్యార్థులు కేవలం చదువుకే పరిమితం కాకుండా వివిధ ప్రయోగాల ద్వారా వారి ప్రతిభను చాటేందుకు ఈ వేదిక ఎంతగానో దోహదపడుతున్నది. 2021-22 సంవత్సరానికి గాను ఇన్స్పైర్ మనక్ నోటిఫికేషన్ విడుదలైంది. అక్టోబర్ 15వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ప్రభుత్వ, ప్రైవేట్, కేజీబీవీ, ఆదర్శ, గురుకులాల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. www.inspireawards. gov.in వెబ్సైట్లో స్కూల్ అథారిటీలోకి వెళ్లి లాగిన్ అయి యూజర్ ఐడీ/పేరు, పాస్వర్డ్ నమోదు చేస్తే సంబంధిత వెబ్ పేజీ తెరుచుకుంటుంది. దాంట్లో విద్యార్థుల పేర్లు, తరగతి, ఆధార్ నంబర్ నమోదు చేయాలి. అనంతరం విద్యార్థులకు సంబంధించిన బ్యాంక్ ఖాతా వివరాలను జత చేయాలి. ఖాతాలు తప్పనిసరిగా జాతీయస్థాయి బ్యాంకులకు చెందినవిగా ఉండాలి. విద్యార్థులు సమర్పించే ప్రాజెక్టు వివరాలను సంక్షిప్తంగా రాత పూర్వకంగా పొందుపర్చాలి. సంబంధిత రైటప్ను వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. విద్యార్థి, ప్రాజెక్టు ఫొటోను అప్లోడ్ చేయాలి. ప్రాజెక్టుల ఎంపిక చేపట్టి తుది జాబితాను 2 నెలల తర్వాత ప్రకటిస్తారు.
ఎంపిక ప్రక్రియ ఇలా..
6 నుంచి 10వ తరగతి విద్యార్థులు పంపిన ప్రదర్శనలను మొదట జిల్లాస్థాయిలో ఎంపిక చేస్తారు. ఎంపికైన వారి ఖాతాల్లో రూ.10 వేల చొప్పున జమ చేస్తారు. జిల్లాస్థాయిలో ఎంపికైన వాటిలో 10 శాతం ప్రదర్శనలను రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తారు. వాటిల్లో ఉత్తమ ప్రదర్శనలను జాతీయ స్థాయికి ఎంపిక చేస్తారు. వాటిల్లో టాప్ 60 ఎగ్జిబిట్స్ను రాష్ట్రపతి భవన్లో ప్రదర్శిస్తారు. ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తారు. వాటిని రాష్ట్రపతి చేతుల మీదుగా విద్యార్థులకు అందిస్తారు.
నైపుణ్యాన్ని వెలికితీసేందుకే
విద్యార్థుల్లో నైపుణ్యాలను వెలికితీసేందుకు ఇన్స్పైర్ మనక్ ఎంతగానో దోహదపడుతుంది. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లోనూ ఆన్లైన్లో ప్రభుత్వం నిర్శహిస్తున్న ఇన్స్పైర్ మనక్ను ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలి. ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థి బ్యాంకు ఖాతాలో రూ.10వేలు జమవుతాయి.
గతేడాది 94 ప్రదర్శనలు..
ఇన్స్పైర్ మనక్లో గతేడాది మహబూబాబాద్ జిల్లా నుంచి 94 ప్రదర్శనలు ఎంపిక కావడం గర్వకారణం. ఈ ఏడాది మరిన్ని ప్రదర్శనలు ఎంపికవ్వాలి. ఈ కార్యక్రమంతో విద్యార్థుల్లో శాస్త్రీయత పెంపొందడంతోపాటు వారిలోని సృజనాత్మకత బయటపడుతుంది. 2019-20 విద్యా సంవత్సరంలో జిల్లా నుంచి గార్ల, ముల్కనపల్లి పాఠశాల విద్యార్థుల ప్రదర్శనలు రాష్ట్రస్థాయికి ఎంపికయ్యాయి. ఈ ఏడాది ఎక్కువ మంది విద్యార్థులు పాల్గొని జిల్లా ఖ్యాతిని పెంచాలి.