న్యూఢిల్లీ: ప్రధాని మోదీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ‘దిమాగీ నక్సల్’ అనే పదాన్ని ఉపయోగించిన మర్నాడు ‘దిమాగీ నక్సల్ పార్టీ’ అనే వ్యంగ్య ఇన్స్టాగ్రామ్ ఖాతా వెలుగులోకి వచ్చి, రాత్రికి రాత్రే 1,81,000కు పైగా ఫాలోవర్లను సంపాదించుకుంది. సోమవారం మధ్యాహ్నం నాటికి ఈ ఇన్స్టా పేజీ 2 లక్షలకు పైగా ఫాలోవర్లను సొంతం చేసుకుంది. ‘కాక్రోచ్ జనతా పార్టీ’ బాటలో ఈ ఖాతా కూడా ఒక ఆన్లైన్ వ్యంగ్య ఉద్యమంగా తనను తాను ప్రదర్శించుకుంది. ఈ ఖాతా ప్రారంభించిన తొలిపోస్టులో తమ పార్టీలో ఎవరు చేరవచ్చో తెలియజేసింది. దానిలో ‘మీ సొంత నాయకులతోనే మీరు విభేదించగలిగితేనే మా పార్టీలో చేరవచ్చు’ అనే నిబంధన అగ్రస్థానంలో ఉంది. సోమవారం ఈ పేజీ కొంతసేపు అందుబాటులో లేకుండా పోయింది. అదే సమయంలో ఇదే పేరుతో సోషల్ మీడియాలో మరికొన్ని ఖాతాలు పుట్టుకొచ్చాయి.