మోదీ పాలనలో మోయలేని భారం
సామాన్య, మధ్యతరగతిపై పెనుభారం
టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, జడ్పీచైర్మన్ సంపత్రెడ్డి ధ్వజం
గ్యాస్ సిలిండర్ ధర పెంపును నిరసిస్తూ
జనగామలో చౌరస్తాలో టీఆర్ఎస్ నిరసన
నేడు మండల కేంద్రాల్లో భారీ ఆందోళనలు
జనగామ, జూలై 7 (నమస్తే తెలంగాణ) : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దౌర్భాగ్య పాలన సాగిస్తూ పేదలపై భారం మోపుతోందని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, జడ్పీచైర్మన్ పాగాల సంపత్రెడ్డి అన్నారు. వంట గ్యాస్ సిలిండర్పై రూ. 50 పెంపును నిరసిస్తూ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ ఎడవెల్లి కృష్ణారెడ్డి, మున్సిపల్, మార్కెట్ చైర్ పర్సన్లు పోకల జమున, బాల్దె విజయ, జనగామ ఎంపీపీ మేకల కళింగరాజు, జీసీసీ మాజీ చైర్మన్ గాంధీనాయక్తో కలిసి జనగామ ఆర్టీసీ చౌరస్తాలో ‘మోదీ కేడీ’ అంటూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సంపత్రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, రైతు, ప్రజావ్యతిరేక చర్యలపై రానున్న రోజుల్లో టీఆర్ఎస్ పెద్దఎత్తున ఆందోళనకు దిగబోతున్నట్లు తెలిపారు. 2020 సెప్టెంబర్లో 14.2 కిలోల సిలిండర్ ధర రూ. 648.50 ఉంటే ప్రస్తుతం రూ.1,105కు చేరిందని మండిపడ్డారు. ప్రజలపై పెనుభారం మోపుతూ సామాన్య, పేద ప్రజలు బతకలేని పరిస్థితులు కల్పిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పెట్రో, గ్యాస్ ధరలను ఇష్టానుసారంగా పెంచుతున్న కేంద్రంలోని బీజేపీ పాలకులకు బుద్ధిచెప్పాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. గతేడాది నవంబర్లో అడ్డూ అదుపు లేకుండా నెలరోజుల వ్యవధిలో పెట్రోలు ధర 10 సార్లు, డీజిల్ ధర 12 సార్లు, ఎనిమిది నెలల వ్యవధిలో వంటగ్యాస్ ధరలు ఆరు సార్లు పెరిగాయన్నారు. ధరల పెరుగుదలతో సగటు మనిషి బడ్జెట్ తల్లకిందులవుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. కమర్షియల్ సిలిండర్ ధర పెంచడంతో చిరువ్యాపారులు వ్యాపారాలు చేసుకోలేకపోతున్నారని అనారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మేకల రాంప్రసాద్, కౌన్సిలర్లు మారబోయిన పాండు, సమద్, వాంకుడోత్ అనిత, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు గౌస్, మార్కెట్ వైస్ చైర్మన్ ఆగిరెడ్డి, టీఆర్ఎస్ జనగామ పట్టణ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సురేశ్రెడ్డి, యాదగిరిగౌడ్, పట్టణ మహిళా అధ్యక్షురాలు చెంచారపు పల్లవి, రఘునాథపల్లి మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు వారాల రమేశ్, టీఆర్ఎస్ నాయకులు పోకల లింగయ్య, పసుల ఏబెల్, బండ యాదగిరిరెడ్డి, బాల్దె సిద్ధిలింగం, గుర్రం నాగరాజు, శ్రీశైలం, ఎం రాజు, తిప్పారపు ఆనంద్, లాజర్, ఎల్లంల రాజు తదితరులు పాల్గొన్నారు.
నేడు మండల కేంద్రాల్లో నిరసనలు..
టీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలతో కేంద్రం పెంచిన గ్యాస్ ధరలను నిరసిస్తూ ఈ నెల 8న జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, జడ్పీచైర్మన్ పాగాల సంపత్రెడ్డి పిలుపునిచ్చారు. మండలంలోని అన్ని గ్రామ, వార్డు కమిటీలు, అనుబంధ విభాగాలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.