భీమదేవరపల్లి, నవంబర్ 29 : చారిత్రక కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయం సమీపంలో అతి పురాతన కేశవమూర్తి ఆలయం ఉన్నది. చుట్టూ పంటపొలాల మధ్య శిథిలావస్థలో భూమిలో కూరుకుపోయి కనిపిస్తున్నది. ఆలయంలో గర్భగుడి, అంతరాలయం, మండపాలున్నాయి. మండప స్తంభాలను నిశితంగా పరిశీలిస్తే కాకతీయుల కాలంలో నిర్మించినట్లు తెలుస్తున్నది. అంతరాలయానికి ఇరువైపులా చతుర్భుజులైన వైష్ణవ ద్వారపాలకులు ఉన్నా గర్భాలయంలో ప్రధాన విగ్రహం లేదు. దుండగులు గుప్త నిధుల కోసం ఇక్కడ తవ్విన ఆనవాళ్లున్నాయి. విగ్రహాన్ని దొంగలు ఎత్తుకెళ్లి ఉంటారని గ్రామస్తులు చెబుతున్నారు. గర్భగుడి ద్వారాలకు కలశాలు, ద్వారాల ఉత్తరాశిమీద లలాటబింబంగా గజలక్ష్మీదేవి ప్రతిమ చెక్కి ఉంది. గర్భగుడిలో కనీసం అధిష్టాన పీఠాలు కూడా కనిపించడం లేదు. మండపం, అంతరాలయం, గర్భగుడుల కప్పుల్లో అష్టదళగర్భిత అష్టకోణయంత్రాలు చెక్కి ఉన్నాయి.
గర్భగుడిలో విగ్రహం ఉండేదని, కాలక్రమేణా ఎవరో మాయం చేశారని, ఆలయం వెనుకభాగాన, గర్భగుడిలో గుప్తనిధుల కోసం గుర్తు తెలియని వ్యక్తులు తవ్వకాలు జరిపారని గ్రామస్తులు చెబుతున్నారు. ఆలయానికి అభిముఖంగా ఆంజనేయస్వామి విగ్రహం ఉంది. సుమారు 25ఏళ్ల క్రితం ఈ విగ్రహం బయల్పడినట్లు స్థానికులు వెల్లడించారు. ఆలయ స్తంభాలు, నిర్మాణశైలి, ద్వారపాలకులు తదితరాలను పరిశీలిస్తే ఈ ఆలయం కేశవమూర్తి లేదా వేణుగోపాలస్వామి ఆలయం కావచ్చని చరిత్రకారులు పేర్కొంటున్నారు. అతి పురాతనమైన ఈ ఆలయానికి ప్రస్తుతం దారి సరిగా లేదు. రెవెన్యూ రికార్డులను పరిశీలిస్తే ఆలయ భూమి బయటపడుతుందని, కబ్జా అయిన భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని అతిపురాతనమైన ఈ ఆలయాన్ని పునరుద్ధరించాలని భక్తులు కోరుతున్నారు.
వారసత్వ సంపదను సంరక్షించాలి
పురాతన ఆలయాలు మన చారిత్రక వారసత్వ సంపద. వీటిని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. గుప్తనిధులు అంటూ తవ్వకాలు చేయడం, ఆలయ భూములను కబ్జా చేయడం పరిపాటిగా మారింది. ఆలయానికి వెళ్లేందుకు ఇప్పుడు దారి కూడా లేకపోవడం దురదృష్టకరం. పురాతన ఆలయాలు, వాటి భూముల పరిరక్షణపై రెవెన్యూ అధికారులు ప్రత్యేక శ్రద్ధపెట్టాలి.
– ఎల్తూరి ప్రభాకర్, కొత్తకొండ ఆలయ ధర్మకర్త
ఆలయాన్ని బాగు చేయాలి
ఎంతో పురాతనమైన ఈ ఆలయాన్ని పునరుద్ధరించాలి. ఆలయ విశిష్టతను చరిత్రకారులు బయటకు తీయాలి. కొత్తకొండకు ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్నది. ఇక్కడి పురాతన ఆలయాలను సంరక్షించి వాటి చరిత్రను భావితరాలకు అందించాలి.
– సిద్దమల్ల రాజేందర్, కొత్తకొండ