కమలాపూర్, ఫిబ్రవరి 23 : మండలంలో మద్యం షాపు యజమానులు సిండికేట్ దందాకు తెరలేపారు. అధిక లాభాలు గడించేందుకు బెల్టుషాపుల నిర్వాహకులతో ఒప్పందం చేసుకుని అడ్డదారులు తొక్కుతున్నారు. మండలంలోని 24 గ్రామాల్లో ఆరు మద్యం షాపులు ఉన్నాయి. కమలాపూర్లో మూడు, ఉప్పల్, శ్రీరాములపల్లి, శనిగరంలో మూడు షాపులు ఉన్నాయి. ఒక్కో మద్యం షాపు యజమాని నాలుగు గ్రామాల చొప్పున పంచుకుని, బెల్ట్షాపుల నిర్వాహకులు తమ షాపులోనే మద్యం కొనుగోలు చేయాలని నిబంధన పెట్టారు. కొనుగోలు చేసే మద్యం బాటిళ్లపై షాపు పేరుతో స్టిక్కర్లను అంటిస్తున్నారు. అయితే బెల్ట్షాపులకు అధిక ధరలకు మద్యం అమ్మకాలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.
ఇటీవల మండలంలో ఎక్సైజ్ అధికారులు అనుమానం ఉన్న బెల్టుషాపుల్లో తనిఖీలు చేశారు. మద్యం బాటిళ్లకు స్థానిక వైన్షాపు స్టిక్కర్ ఉండడంతో వదిలేశారు. మండలంలోని వైన్స్లోనే మద్యం కొనుగోలు చేయాలని, లేదంటే సీజ్ చేస్తామని ఎక్సైజ్ అధికారులు హెచ్చరించినట్లు తెలిసింది. ప్రభుత్వం బెల్టుషాపులు ఎత్తేస్తామని చెప్పినా ఎక్సైజ్ అధికారులు మామూళ్లు తీసుకుంటూ చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమ షాపులో మద్యం కొనుగోలు చేయడం లేదనే అక్కసుతో ఇటీవల మండల కేంద్రంలో ఓ దాబా నిర్వాహకుడిని మద్యం వ్యాపారులే టాస్క్ఫోర్స్ పోలీసులకు పట్టించినట్లు ప్రచారం జరుగుతోంది.