హనుమకొండ, జనవరి 5 : ఈ నెల 10న హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష నిర్వహిస్తున్నారని హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ తెలిపారు. సమావేశానికి డివిజన్కు ముగ్గురు చొప్పున 90మంది కార్యకర్తలను వెళ్లనున్నారన్నారు. బాలసముద్రంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమన్నారు. గెలిస్తే పొంగిపోను.. ఓడితే కుంగిపోయేది లేదని పేర్కొన్నారు. ప్రజల మధ్యే ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలు పంచుకుంటానని, అంబేద్కర్ ఆశయాల మేరకు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి దేశానికే తెలంగాణను ఆదర్శంగా నిలిపిన మహనీయుడు మాజీ సీఎం కేసీఆర్ అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను కప్పిపుచ్చుకొనేందుకు బీఆర్ఎస్పై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కక్షపూరితంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ అభివృద్ధికి ఆటంకం కలిగించొద్దని హితవు పలికారు. రాబోయే ఎంపీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే పోరాటం చేస్తామన్నారు. కార్యక్రమంలో కుడా మాజీ చైర్మన్లు మర్రి యాదవరెడ్డి, సుందర్రాజ్ యాదవ్, పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ జనార్దన్ గౌడ్, కార్పొరేటర్లు బొంగు అశోక్ యాదవ్, చెన్నం మధు, సోదా కిరణ్, సంకు నర్సింగ్, ఇమ్మడి లోహితారాజు, ఎలకంటి రాములు, గుంటి రజిత, పులి రజినీకాంత్, ఉడుతల సారంగపాణి, విష్ణువర్ధన్రెడ్డి, సుగుణాకర్రెడ్డి, కేశవరెడ్డి, రజిత తదితరులు పాల్గొన్నారు.