నర్సంపేట(దుగ్గొండి), నవంబర్ 10: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి గ్యారెంటీ, వారెంటీ లేదని, ఆ పార్టీ నేతలు చేస్తున్న మోసపూరిత వాగ్దానాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి విమర్శించారు. దుగ్గొండి మండలం ముద్దునూరు, మల్లంపల్లి, గుడ్డేలుగులపల్లి, చంద్రయ్యపల్లె, బొబ్బరోనిపల్లి, మర్రిపెల్లి, మహ్మదాపురం, నారాయణతండా, తిమ్మంపేట, చలపర్తి, రేఖంపెల్లి, శివాజీనగర్, తొగర్రాయిలో శుక్రవారం ఆయన పార్టీ శ్రేణులతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు బతుకమ్మలు, బోనాలతో పెద్దికి స్వాగతం పలికారు. అనంతరం సుదర్శన్రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్కు, తెలంగాణ రాష్ర్టానికి సీఎం కేసీఆర్ మాత్రమే గ్యారెంటీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ చెబుతున్న ఆరు గ్యారెంటీ పథకాలు బూటకమన్నారు. సాధ్యంకాని హామీలను ప్రజలు నమ్మొద్దని కోరారు. తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడ వేస్తున్నదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మూడు గంటల కరెంటు ఇస్తామంటున్నదని, రైతులకు రైతుబంధు పథకం వద్దని ఆ పార్టీ నేతలు చెబుతున్నారని విమర్శించారు. ప్రజలు ఎట్టి పరిస్థితిలోనూ కాంగ్రెస్కు ఓటెయ్యరని స్పష్టం చేశారు. ఆ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రం అధోగతి పాలవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి 25 ఏళ్లపాటు అధికార పక్షంలో ఉన్నారని పెద్ది అన్నారు. ముగ్గురు సీఎంలు మారారని గుర్తుచేశారు. కానీ, దొంతి నర్సంపేట నియోజకవర్గంలోని ఒక్క గ్రామంలో కూడా అభివృద్ధి చేయలేదని విమర్శించారు. ఇప్పుడు ఎన్నికలు రాగానే రెండు నెలల నుంచి పల్లెల్లో తిరుగుతున్నాడని ఎద్దేవా చేశారు. ఎలాంటి నాయకులను ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. గతంలో అభివృద్ధిని పట్టించుకుని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. గతంలో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన దొంతి మాధవరెడ్డి అసెంబ్లీలో మాట్లాడిందేమీ లేదన్నారు. ఇక్కడి సమస్యలను కూడా ప్రస్తావించలేదని విమర్శించారు. అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ ఎంతటి అబద్ధాలైనా ఆడుతుందని ధ్వజమెత్తారు. గతంలో నియోజకవర్గంలో టీడీపీ, కాంగ్రెస్ పొత్తులు పెట్టుకోగా, ఇప్పుడు రేవూరి, దొంతి ఇద్దరూ కాంగ్రెస్లోనే చేరారని స్పష్టం చేశారు. జెండాలు, ఎజెండాలను పక్కనబెట్టి ఒక్కటైన వారికి ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. రూ. 32 కోట్లతో దుగ్గొండి మండలం గిర్నిబావి నుంచి నల్లబెల్లి మండలం 365 నేషనల్ హైవే వరకు డబుల్ రోడ్డు నిర్మించామన్నారు. డివిజన్లో అంతర్గత రహదారులను పూర్తి చేశామన్నారు. అభివృద్ధి చేసిన తనను మరోసారి ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, ఎంపీపీ కాట్ల కోమలా భద్రయ్య, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సుకినె రాజేశ్వర్రావు, నాయకులు శానబోయిన రాజ్కుమార్, గోనె యువరాజు, జైపాల్రెడ్డి, శ్రీనివాసరెడ్డి, పుచ్చకాయల బుచ్చిరెడ్డి, మోడెం విద్యాసాగర్, రేవూరి సురేందర్రెడ్డి, మనోహన్రావు, కేశవరెడ్డి, కొంరెల్లి, కోరె చందు, శంకేశి శోభా కమలాకర్, క్లస్టర్ ఇన్చార్జీలు పాల్గొన్నారు.
నర్సంపేటరూరల్/చెన్నారావుపేట/నెక్కొండ: గడిచిన ఐదేళ్లలో నర్సంపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని, మరోసారి ఆశీర్వదిస్తే గ్రామాల్లో మిగిలి ఉన్న పనులను పూర్తి చేస్తానని ఎమ్మెల్యే పెద్ది అన్నారు. చంద్రయ్యపల్లికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త బరిగెల రాజయ్యతోపాటు మరికొంత మంది పెద్ది సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. అదేవిధంగా గురిజాలకు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు తెప్ప నర్సయ్య, పెండ్యాల సంతోష్, పెండ్యాల ఐల్రాజు, సున్నపు నర్సింగం, పొదిల వీరస్వామి, సున్నపు పాపయ్య, కక్కెర్ల గణేశ్, తెప్ప నగేశ్తోపాటు మరో పది మంది బీఆర్ఎస్లో చేరగా సుదర్శన్రెడ్డి ఆహ్వానించారు. అలాగే, చెన్నారావుపేట మండల ఉప్పరపల్లి, కల్నాయక్తండా, జీడిగడ్డతండాలో పెద్ది ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఉప్పరపల్లిలో సర్పంచ్ పెరుమాండ్ల శ్రీధర్రెడ్డి ఆధ్వర్యంలో డప్పుచప్పుళ్లు, బతుకమ్మలు, బోనాలతో పెద్దికి ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి మాట్లాడుతూ తాను ప్రచారానికి వచ్చినట్లు లేదని, జనాన్ని చూస్తే విజయోత్సవ రాలీకి వచ్చినట్లుందనన్నారు. అంతేకాకుండా నెక్కొండ మండలంలోని అప్పల్రావుపేటకు చెందిన వంద కాంగ్రెస్ కుటుంబాలు బీఆర్ఎస్లో చేరగా, పెద్ది ఆహ్వానించారు. నర్సంపేట నియోజకవర్గంలో కొండంత అభివృద్ధి జరిగిందని, రాజకీయాలకతీతంగా ప్రజలు కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు.