వరంగల్చౌరస్తా, ఏప్రిల్ 18 : మురికివాడలు లేని నగరంగా వరంగల్ను తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనులు చేపడుతున్నామని, గుడిసెకాలనీలను స్మార్ట్ స్ట్రీట్స్ గా మార్చుతామని తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. మంగళవారం 27వ డివిజన్ పరిధిలోని ఎల్వీఆర్ నగర్ గుడిసెవాసుల కాలనీలో జీవో 58, 59 ఆధారంగా అందించనున్న పట్టాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి ప్రత్యేకంగా ఉచిత ఆన్లైన్ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నన్నపునేని మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటుకు ముందు పేదల గుడిసెలకు నిలువనీడ లేకుండా, భధ్రత లేకుండా ఉండేదన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఉద్యమం చేసి తెలంగాణ సాధించుకున్న నాటి నుంచి ఎక్కడా పేదల కాలనీలు, గుడిసెవాసుల కాలనీలను తొలగించకుండా వారికి కనీస నీడని అందించాలనే కృతనిశ్చయంతో పని చేస్తూ, జీవో 58, 59ని ప్రవేశ పెట్టినట్లు చెప్పారు. ఈ జీవో ఆధారంగా ఎక్కడి వారికి అక్కడే పట్టాలు అందించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. త్వరలోనే తూర్పు నియోజకవర్గంలోని మొత్తం గుడిసెకాలనీలతో పాటుగా ఎల్వీఆర్ నగర్ వాసులకు సొంత ఇంటి కల నెరవేరనుందన్నారు.
ఈ కాలనీవాసులకు పట్టాలు అందించాలని నిర్ణయించి మౌలిక వసతులు కల్పించడానికి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. నగరం నడిబొడ్డున ఉన్న ఈ కాలనీకి విద్యుత్ సౌకర్యం లేకుండా చీకట్లో ఉంటున్న వారి కోసం కొత్త స్థంభాలను ఏర్పాటు చేయించి, విద్యుత్ అందించినట్లు తెలిపారు. అలాగే, మిషన్ భగీరథ పైపులైన్ కూడా ఏర్పాటు చేసి, తాగునీటి కష్టాలను తీర్చినట్లు చెప్పారు. త్వరలోనే పట్టాలను అందించి, పక్కా ఇంటి నిర్మాణం కోసం రూ.3లక్షల పథకం ద్వారా నిధులు అందజేస్తామని తెలిపారు. దరఖాస్తు ఖర్చులు సైతం తానే చెల్లిస్తానని, ఎవరూ నగదు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. పట్టాలు అందిన వెంటనే రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టి స్మార్ట్ స్ట్రీట్గా మార్చడానికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జారతి రమేశ్, నియోజకవర్గ నాయకుడు మర్రి శ్రీనివాస్ పాల్గొన్నారు.
గుడిసెవాసులను ఆదుకుంటాం
పోచమ్మమైదాన్ : గుడిసెవాసులందరినీ ఆదుకుంటామని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. 22వ డివిజన్లోని పోచమ్మమైదాన్ ఏరియాలో నివసిస్తున్న గుడిసెవాసులకు 58,59 జీవో అమలుపై సోమవారం రాత్రి అవగాహన సదస్సు నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆదేశాలలతో గుడిసెవాసుల కల నెరవేరుతోందన్నారు. అర్హులైనవారందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ డివిజన్ ఇన్చార్జి మావురపు విజయభాస్కర్రెడ్డి, నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.