రేగొండ, మార్చి 25 : కొడవటంచ లక్ష్మీనరసింహస్వామి జాతర సోమవారం వైభవంగా ప్రారంభమైంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. రాత్రి పెద్ద రథంపై స్వామి వారిని ఆలయ మాడవీధుల గుండా ఊరేగించారు. ఆ తర్వాత బోనాలు, ఎడ్లబండ్లు, వాహనాల ప్రదక్షిణతో జాతర ఆరంభమైంది. గ్రామానికి చెందిన సన్నాయిల సారయ్య ఇంటి నుంచి పెద్ద బోనం, జోగయ్యపల్లెకు చెందిన కునుకుంట్లు దేవేందర్రావు, విజేందర్రావు ఇంటి నుంచి గజవాహనం తీసుకొచ్చారు. స్వామి వారి ఊరేగింపు సందర్భంగా మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. భక్తులు భారీగా తరలివచ్చి రథాన్ని లాగారు. స్వామి వారికి ఇష్టమైన ప్రభబండ్లు, ఏనుగు, మేక ఆకారంతో ఉన్న బొమ్మల బండ్లు రకరకాల రంగులతో తయారు చేసి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పెద్ద రథం ఊరేగింపులో పాల్గొన్నారు. ఎన్సీసీ, స్వచ్ఛంద సంస్థల యువకులు సేవలందించారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తాగునీటి వసతులతోపాటు, మరుగుదొడ్లు, స్నానఘట్టాలు, వైద్య, విద్యుత్తో పాటు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించారు. ఆలయ చైర్మన్ ముల్కనూరి భిక్షపతి, ఈవో బిళ్ల శ్రీనివాస్, ధర్మకర్తలు ఏర్పాట్లను పర్యవేక్షించారు.