మంత్రి కేటీఆర్ హైదరాబాద్ నుంచి నేరుగా గీసుగొండ, సంగెం మండలాల్లోని శాయంపేట, చింతలపల్లి గ్రామాల వద్ద రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు హెలీకాప్టర్లో పరిశ్రమల కార్యదర్శి జేఎస్ రంజన్, ప్రభుత్వ సలహాదారు రాజీవ్శర్మ, కిటెక్స్ గార్మెంట్స్ చైర్మన్ సాబూ ఎం జాకబ్తో కలిసి ఉదయం 10.14గంటలకు చేరుకున్నారు. వారికి మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతిరాథోడ్, చీప్విఫ్ దాస్యం వినయ్భాస్కర్, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, నన్నపునేని నరేందర్, పెద్ది సుదర్శన్రెడ్డి, ఎంపీ పసునూరి దయాకర్, జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, దివ్యాంగుల సహకార సంస్థ చైర్మన్ వాసుదేవారెడ్డి, సీపీ తరుణ్జోషి, కలెక్టర్ గోపి స్వాగతం పలికారు. ముందుగా 187 ఎకరాల్లో రూ.1,600 కోట్లతో కిటెక్స్ కంపెనీ నిర్మించే వస్త్ర పరిశ్రమలకు భూమి పూజ చేశారు. ఇక్కడే రూ.100 కోట్లతో మిషన్ భగీరథ నీటి సరఫరా పనులకు శంకుస్థాపన చేశారు. రూ.1,100 కోట్లతో ఉత్తర కొరియాకు చెందిన యంగ్వన్ కంపెనీ వస్త్ర పరిశ్రమలు నెలకొల్పనున్న 263 ఎకరాల స్థలాన్ని ఫొటో ఎగ్జిబిషన్ ద్వారా పరిశీలించారు.
ఇప్పటికే పార్కులో గణేశ ఎకో స్పేర్ కంపెనీ నిర్మించిన వస్త్ర పరిశ్రమలను కంపెనీ చైర్మన్ శరత్శర్మతో కలిసి ప్రారంభించారు. అక్కడి నుంచి నడుచుకుంటూ పార్కులో రోడ్లు, పరిశ్రమల నిర్మాణాలను పరిశీలిస్తూ నాయకులు, కార్యకర్తలతో మాట్లాడుతూ ఆర కిలోమీటర్ దూరాన ఉన్న గణేశా ఎకోపెట్ వద్దకు చేరుకున్నారు. కంపెనీలో వేస్ట్ ప్లాస్టిక్ బాటిల్ ముడి సరుకును పరిశీలించారు. అనంతరం పార్కు ఆవరణలో ఏర్పాటు చేసిన పరకాల నియోజకవర్గ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. తర్వాత మామునూర్ ఎయిర్పోర్టుకు వెళ్లి పరిశీలించారు. రెండు గంటల పాటు సాగిన పర్యటనలో యువకులు మంత్రి కేటీఆర్తో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. వివిధ సమస్యలపై స్థానిక నాయకులు, కార్యకర్తలు వినతి పత్రాలు అందించారు.