వరంగల్ : టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఎంతోమంది గులాబీ దళంలో చేరడం రివాజుగా మారింది. సీఎం కేసీఆర్ సర్కారుతోనే అభివృద్ధి సాధ్యం అనేది నానుడిగా మారింది. అభివృద్ధి జరుగాలంటే టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే అవుతుందని జనం బలంగా నమ్ముతున్నారు.
ఈ నమ్మకంతోనే తాజాగా చెన్నారావుపేట మండలం కోనాపురం గ్రామ సర్పంచ్ (కాంగ్రెస్) వెల్దే సుజాత టీఆర్ఎస్లో చేరారు. ఆమె పాటు వార్డు సభ్యులు చిలువేరు రవి, కిసాన్ సెల్ అధ్యక్షుడు సజ్జుల బాబురావు, యూత్ అధ్యక్షులు పరికి అనిల్ లతో పాటు గ్రామంలోని పలువురు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు దాదాపు 120 మంది నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.
పార్టీలోకి చేరిన వారికి ఎమ్మెల్యే టీఆర్ఎస్ కండువాను కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్ది మాట్లాడుతూ.. పార్టీలోకి చేరిన వారందరిని కంటికి రెప్పలా చూసుకుంటామన్నారు. రాష్ట్రంలో అభివృద్ధిని చూసే వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నారని ఆయన తెలిపారు.