సిద్దిపేట ప్రతినిధి/ చేర్యాల, జనవరి 7 (నమస్తే తెలంగాణ) : మేళతాళాలు.. మంగళవాయిద్యాలు.. భక్తుల జయజయధ్వానాల మధ్య కొమురవెల్లి మల్లికార్జునస్వామి కల్యాణం వైభవంగా జరిగింది. ఆదివారం సిద్దిపేట జిల్లా మల్లన్న క్షేత్రంలోని తోట బావి కల్యాణ వేదిక వద్ద లగ్గం జరిగింది. కల్యాణాన్ని వీక్షించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. కల్యాణోత్సవంలో స్వామి వారి తరఫున పడిగన్నగారి మల్లికార్జున్ దంపతులు, అమ్మవార్ల తరఫున మహాదేవుని మనోహర్ దంపతులు పాల్గొన్నారు. అమ్మవారి తరఫున మహాదేవుని సాంబయ్య, స్వామి వారి తరఫున పడిగన్నగారి మల్లయ్య దంపతులు పాల్గొని కల్యాణ తంతు నిర్వహించారు. ప్రభుత్వం తరపున రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలను రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్రెడ్డి, చామకూర మల్లారెడ్డి.. మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్రెడ్డితో కలిసి సమర్పించారు.
స్వస్తిశ్రీ శోభకృత్ నామ సంవత్సరం మార్గశిర మాసం ఏకాదశి ఉదయం 10.45 గంటలకు నిర్వహించాల్సిన కల్యాణం ఆలస్యంగా జరిగింది. కొమురవెల్లి పుణ్యక్షేత్రంలోని ఇంద్రకీలాద్రి ఆలయ ప్రాంగణంలోని తోటబావి వద్ద నిర్మించిన కల్యాణ వేదిక వద్ద స్వామి వారి కల్యాణం నిర్వహించారు. అంతకుముందు ఊరేగింపుగా వెళ్లి స్వామివారి తరపున మహాదేవుని వంశస్తులు, పడిగన్నగారి వంశస్తులు కూర్చుని కల్యాణోత్సవం నిర్వహించారు. స్వామివారి కల్యాణానికి తాళి, మట్టెలు, ఒడి బియ్యం, బట్టలు తీసుకొచ్చారు. మధ్యాహ్నం 12గంటలకు రుద్రాభిషేకం, సాయంత్రం శకటోత్సవం నిర్వహించారు.
గతేడాది జరిగిన కల్యాణోత్సవం సందర్భంగా మల్లన్నస్వామికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు రూ.5లక్షలకు పైగా కట్నాలు సమర్పించుకున్నారు. కానీ, ఈసారి కల్యాణోత్సవం సందర్భంగా మంత్రులు కొండా సురేఖ రూ.5116, పొన్నం ప్రభాకర్ రూ.5116, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి రూ.5116, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి రూ.5116, కొమ్మూరి ప్రతాప్రెడ్డి రూ.5,116, కొండా సురేఖ కుమార్తె సుష్మితాపటేల్ రూ.21,116తో పాటు మరికొందరు వీఐపీలు చదివించిన కట్నాలు రూ. లక్షలోపే కావడం గమన్హారం.