నయీంనగర్, మార్చి15: కాకతీయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో సౌత్ జోన్ స్థాయి ఖోఖో(మహిళా) పోటీలు నిర్వహిస్తున్నట్లు వీసీ తాటికొండ రమేశ్ వెల్లడించారు. ఈ నెల 17నుంచి 20 వరకు జరిగే క్రీడాపండుగపై విశ్వవిద్యాలయ సెనెట్ హాల్లో మంగళవారం పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడారు. మొదట 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను విశ్వవిద్యాలయ బ్లాక్ గ్రాంట్కు అదనంగా 30 శాతం నిధులు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఐదేళ్ల విరామం తర్వాత కేయూ ఆతిథ్యం ఇవ్వనున్న పోటీల్లో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పాండిచ్చేరి నుంచి 67 జట్లు పాల్గొంటాయని, ఇందుకోసం ఆరు మైదానాలు ఏర్పాటు చేశామని చెప్పారు. వివిధ విశ్వవిద్యాలయాల నుంచి వచ్చే క్రీడాకారుల కోసం క్యాంపస్లోని స్పోర్ట్స్ హాస్టల్, ఇంజినీరింగ్ కళాశాలతో పాటు కొన్ని విభాగాల్లో వసతి కల్పిస్తున్నామని పేర్కొన్నారు. అధికారులు, కోచ్లు, మేనేజర్లకు సైతం వసతి ఏర్పాట్లు చేశామని చెప్పారు. 35మంది రెఫరీలు హాజరవుతున్నారని తెలిపారు. 17న ఉదయం పోలీస్ కమిషనర్ తరుణ్జోషితో కలిసి పోటీలను ప్రారంభిస్తామని వీసీ వివరించారు.
ఈ నెల 20 -21న పీవీ నరసింహారావు విజ్ఞాన పీఠం, విశ్వవిద్యాలయ సోషియాలజీ విభాగం ఆధ్వర్యంలో భారతదేశంలో ‘ఉన్నత విద్య- అవకాశాలు, సవాళ్లు, పరిషారాలు’ అంశంపై అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తామని, దేశ విదేశాల నుంచి 120 పరిశోధనా పత్రాలు అందాయని, 15 రాష్ర్టాల నుంచి, అమెరికా, ఇరాన్, టాంజానియా, మలేషియా నుంచి (ఆన్లైన్, ఆఫ్లైన్) ప్రతినిధులు పాల్గొంటారని వీసీ తెలిపారు. విద్యార్థులకు కొవిడ్ నిబంధనల మేరకు తరగతులు ప్రారంభమయ్యాయని, పీహెచ్డీ ప్రవేశాలకు చర్యలు చేపట్టామని తెలిపారు. 29న 37వ అకడమిక్ సెనెట్ నిర్వహిస్తున్నామని, స్నాతకోత్సవానికి కూడా సన్నద్ధమవుతున్నామని, న్యాక్ గుర్తింపు కోసం విభాగాలను సిద్ధం చేస్తున్నామని చెప్పారు. విశ్వవిద్యాలయ భూముల రక్షణకు చర్యలు చేపడుతున్నామని, ప్రభుత్వ ఉత్తర్వులు మేరకు నియామక ప్రక్రియ చేపడుతున్నామని వివరించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య బీ వెంకట్రామరెడ్డి, క్యాంపస్ ప్రిన్సిపాల్ ఆచార్య బీ సురేలాల్, క్రీడా కార్యదర్శి డాక్టర్ టీ సవితా జ్యోత్స్న పాల్గొన్నారు.