నర్సంపేట, ఏప్రిల్ 12 : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నర్సంపేట నియోజకవర్గంలో ఇప్పటివరకు ఒక్క అభివృద్ధి పనైనా జరిగిందా? అని వరంగల్ జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ దుగ్గొండి మండల ముఖ్య నాయకులతో కలిసి గురువారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలు ముగిసి, పార్లమెంటు ఎన్నికలు వచ్చాయన్నారు. కానీ, నర్సంపేట నియోజకవర్గంలో ఒక్క అభివృద్ధి పని జరుగలేదని విమర్శించారు. గతంలో మంజూరై చేపట్టిన పనులు కూడా ముందుకు సాగడం లేదని విమర్శించారు. అసలు అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే దొంతికి పట్టింపు ఉందా? అని ప్రశ్నించారు. ఈ పనులన్నీ స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజల విజ్ఞప్తి మేరకు బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిందని గుర్తుచేశారు. బ్రిడ్జిలు మినహాయించి 80 బీటీరోడ్ల పనులు మంజూరు చేశామన్నారు. ఈ పనులు పూర్తయితే 160 గ్రామాలను అనుసంధానం ఏర్పడుతుందన్నారు. మొత్తం 165 కిలో మీటర్ల నిడివి గల బీటీరోడ్లు ప్రారంభ దశలో ఉన్నాయన్నారు. నర్సంపేట నియోజకవర్గంలో జీవో నంబర్ 447 అనుసరించి సీఆర్ఆర్, గ్రాంటు ద్వారా రూ. 23 కోట్లతో 18 రోడ్లు, జీవో నంబర్ 396లో రూ.40.13 కోట్లతో 13 రోడ్లు, మూడు బ్రిడ్జిలు, జీవో 260లో రూ.36.56 కోట్లతో 25 బీటీ రోడ్లు, జీవో నంబర్ 242తో రూ. 37.42 కోట్లతో 24 బీటీ రోడ్లు మంజూరైనట్లు వివరించారు. గత కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసిన పనులను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే చేపట్టి పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఎంపీపీ కాట్ల కోమలా భద్రయ్య, పార్టీ మండల అధ్యక్షుడు రాజేశ్వర్రావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పొన్నం మొగిలి, శంకేశి కమలాకర్, రంగారావు, రాజు, శోభన్, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
ఖానాపురం : కేసీఆర్ సర్కారు మంజూరు చేసిన బీటీరోడ్ల నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు పార్టీ ఆధ్వర్యంలో మండలంలోని వేపచెట్టుతండా, మర్నాగిబోడుతండా, కొడ్తిమాట్తండా, బోటిమీదితండా, బుధరావుపేటలో నిలిచిపోయిన రోడ్ల నిర్మాణ పనులను వారు పరిశీలించి రోడ్లపై పూలు చల్లి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహాలక్ష్మీ వెంకటనర్సయ్య, ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్రావు మాట్లాడుతూ పెద్ది సుదర్శన్రెడ్డి సహకారంతో బీఆర్ఎస్ సర్కార్ నియోజకవర్గంలో తండాలు, మారుమూల గ్రామాలకు బీటీరోడ్లు మంజూరు చేసిందని తెలిపారు. వేపచెట్టుతండాలో బీటీరోడ్లకు రూ. 1.50 కోట్లు మంగళవారిపేట-కొడ్తిమాట్తండా బీటీరోడ్డుకు రూ. 2.25 కోట్లు, మంగళవారిపేట-మర్నాగిబోడుతండా రోడ్డుకు రూ. 1.10 కోట్లు, మంగళవారిపేట-బోటిమీదితండా రోడ్డుకు రూ.96 లక్షలు, అక్కడి నుంచి నాజీతండా వరకు రూ. 45 లక్షలు, బుధరావుపేటలో అంతర్గత రోడ్ల నిర్మాణానికి రూ. 1.60 కోట్లు, బుధరావుపేట నుంచి టేకులతండా వరకు రూ.90 లక్షలు మొత్తంగా రూ. 8.76 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. బీఆర్ఎస్ హయాంలోనే టెండర్ ప్రక్రి య పూర్తయిందని, కొన్నిచోట్ల మెటల్ పనులు కూడా ప్రారంభమైనట్లు వివరించారు. ఇన్నేళ్లు బీటీరోడ్లు ఎరుగని తండాలకు మంజూరు చేయిస్తే పనులను పూర్తి చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు. వెంటనే ఎమ్మెల్యే దొంతి స్పందించి రోడ్ల పనులను పూర్తి చేయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్గౌడ్, సదర్లాల్, మాజీ సర్పంచ్లు భూక్యా పద్మావతి, వెంకన్న, గుగులోత్ సుమన్, రమేశ్నాయక్, పద్మ, అశోక్, కాస ప్రవీణ్కుమార్, మౌలానా, బాలు, వెంకన్న, యాకూబ్పాషా, రాంనర్సింహారెడ్డి, ఎల్లయ్య, ప్రశాంత్ పాల్గొన్నారు.
నల్లబెల్లి: కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసిన బీటీరోడ్ల పనులను తక్షణమే నిర్మించాలని మండల ప్రజలు డిమాండ్ చేశారు. మండలంలోని పలు గ్రామాల ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి పూలతో నిరసన తెలిపారు. మండలంలో మొత్తం రూ. 20.90 కోట్లతో బీటీ రోడ్ల నిర్మాణానికి కేసీఆర్ సర్కార్ టెండర్లు, అగ్రిమెంట్లు పూర్తి చేసిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలైనా రోడ్ల పనులు చేపట్టకపోవడం సరికాదన్నారు.