కరీమాబాద్, నవంబర్ 4: మళ్లీ కేసీఆరే ముఖ్యమంత్రి కానుతున్నారని, బీఆర్ఎస్ సర్కారు చేస్తున్న అభివృద్ధి, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ప్రజలు ఫిదా అవుతున్నారని శాసన మండలి డిప్యూటీ చైర్మన్, నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి బండా ప్రకాశ్ అన్నారు. ఉర్సు బైపాస్ రోడ్డులోని ఓ ఫంక్షన్ హాల్లో శనివారం తూర్పు నియోజకవర్గం పరిధిలోని డివిజన్లకు చెందిన వంద ఓట్ల బాధ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బండా ప్రకాశ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పని చేయాలని పిలుపునిచ్చారు. మరోసారి తూర్పులో గులాబీ జెండాను ఎగరవేయాలని కోరారు. ప్రజలను కలిసి బీఆర్ఎస్కు ఓటు వేసేలా చూడాలన్నారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రూపొందించిన బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను ప్రతి గడపకు చేర్చాలన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధిని వివరించి ఓట్లు అభ్యర్థించాలన్నారు. తూర్పులో బీఆర్ఎస్ విజయం సాధించేందుకు సమష్టిగా కృషి చేయాలని కోరారు.
అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించాలి
బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నియోజకవర్గంలోని ప్రతి ఇంటికీ వెళ్లి ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను ఓటర్లకు వివరించాలని ఎమ్మెల్యే నరేందర్ కోరారు. మరోసారి కారు గుర్తుకు ఓటువేసి బీఆర్ఎస్ను ఆశీర్వదించాలని ప్రజలను కోరాలన్నారు. వంద ఓట్లకు ఒక బాధ్యుడిని నియమించామని, వారు శక్తివంచన లేకుండా పని చేసి, మెజారిటీ ఓట్లు సాధించేలా కృషి చేయాలన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం నిలిచిపోకుండా ఉండాలంటే మళ్లీ కేసీఆరే సీఎం కావాలనే విషయాన్ని ప్రజలకు వివరించాలన్నారు. కార్యక్రమంలో ఖాదీ బోర్డు చైర్మన్ మౌలానా, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు, డివిజన్ నాయకులు పాల్గొన్నారు.
మైనార్టీల సంక్షేమానికి ముఖ్యమంత్రి కృషి
తెలంగాణలోని మైనార్టీల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేశారని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ఖిలా వరంగల్ రోడ్డులోని ఈద్గాలో శుక్రవారం రాత్రి అధ్యక్షుడు ఎంఏ జబ్బార్ ఆధ్వర్యంలో గ్యార్మీ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గంలోని మైనార్టీలకు అండగా ఉంటానన్నారు. కార్యక్రమంలో హసన్ అలీ బేగ్, మాషుక్, దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.
బొడ్రాయి వేడుకల్లో..
వరంగల్ 39వ డివిజన్లో చేపట్టిన బొడ్రాయి ప్రతిష్ఠాపనోత్సవంలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మన సంస్కృతీ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను కాపాడుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డివిజన్ బొడ్రాయి ఉత్సవ వేడుక నిర్వాహకులు పాల్గొన్నారు.
ఎల్వీఆర్నగర్ వాసుల విరాళం
ఎమ్మెల్యే నరేందర్ విజయాన్ని కాంక్షిస్తూ ఎల్వీఆర్నగర్ వాసులు ప్రచార ఖర్చుల కోసం విరాళాలు అందజేశారు. వరంగల్ అండర్ బ్రిడ్జి వద్ద ఉన్న ఎల్వీఆర్నగర్లో కాలనీవాసులు శుక్రవారం రాత్రి ప్రచార ఖర్చు కోసం విరాళాలు సేకరించి ఎమ్మెల్యేకు అందజేశారు. ఏళ్ల తరబడి గుడిసెల్లో నివాసముంటున్న తమకు పట్టాలు అందించిన నన్నపునేని గెలుపునకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. నగరం నడిబొడ్డున గుడిసెవాసులుగా ఉన్న తమకు గత ప్రభుత్వాల హయాంలో కనీస వసతులు కల్పించలేదన్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే నరేందర్ ఆధ్వర్యంలో తమకు కరెంటు, తాగునీటి వసతి కల్పించడంతోపాటు రోడ్లు ఏర్పాటు చేశారన్నారు. కార్యక్రమంలో 27వ డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే, 41వ డివిజన్కు చెందిన చిన్నారులు లాస్య, విహారిక, గగన్ శౌర్య తమ పాకెట్ మనీని ఎమ్మెల్యేకు విరాళంగా అందజేశారు.